
హైదరాబాద్: వన్డేల్లో పాక్ తరుపున డబుల్ సెంచరీ సాధించిన ఫకార్ జమాన్ను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు బంతి వేగంలో మార్పులు చేయాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ సూచించాడు. మంగళవారం ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైంది. టోర్నీలో భాగంగా దుబాయి వేదికగా సెప్టెంబర్ 19న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో ఫకార్ జమాన్ను కట్టడి చేసేందుకు హస్సీ భారత బౌలర్లకు కొన్ని సూచనలు చేశాడు. "మంచి లైన్, లెంగ్త్తో కట్టుదిట్టంగా క్రమశిక్షణతో ఫకeర్కు బంతులు వేయాలి. డాట్ బాల్స్ వేస్తూ అతడిపై ఒత్తిడి పెంచాలి. బంతి వేగంలో తరుచూ మార్పులు చేయాలి. ఒత్తిడికి లోనయ్యేలా చేసి త్వరగానే భారీ షాట్లు ఆడేలా కవ్వించాలి" అని హస్సీ అన్నాడు.
"బంతిని బలంగా బాదడం అతడి స్వభావం. అందుకే బంతి వేగంలో మార్పులు చేస్తే ఉపయోగకరం. ఫకార్ జమాన్ అద్భుతమైన ఆటగాడు. వేగంగా మైదానం అన్ని వైపులా పరుగులు చేస్తాడు. ప్రత్యర్థుల బౌలింగ్లో అతడు పొరపాట్లు చేయడం చాలా తక్కువ. ఆసియ్ కప్లో భారత్, పాకిస్థానే తన ఫేవరెట్లు" అని హస్సీ తెలిపాడు.
మరోవైపు రషీద్, ముజీవ్ ఉర్ రెహ్మాన్ ఉన్న ఆప్ఘనిస్థాన్ ఆసియా కప్లో సంచలనాలు చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని హస్సీ పేర్కొన్నాడు. ఆప్ఘన్ జట్టు భారీగా పరుగులు చేస్తే ప్రత్యర్థికి గెలుపు కష్టమేనని చెప్పుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో ఫకార్ జమాన్ అద్భుతమైన ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే.
బులవాయోలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 156 బంతుల్లో 210 పరుగులు చేసి డబుల్ సెంచరీ సాధించిన తొలి పాక్ ఆటగాడిగా, అంతర్జాతీయ క్రికెట్లో తొమ్మిదో బ్యాట్స్మెన్గా తన పేరిట అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు వన్డేల్లో వేగంగా వెయ్యి పరుగులు సాధించిన విండిస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ రికార్డుని కూడా ఫకార్ అధిగమించాడు.