
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి రెండేళ్ల నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్ షార్జీల్ ఖాన్ తిరిగి క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షార్జిల్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యాంటీ కరప్షన్ యూనిట్ (అవినీతి నిరోధక శాఖ) నుంచి క్లియరెన్స్ రావడంతో రీఎంట్రీ ఇవ్వడానికి మార్గం సుగుమం అయ్యింది. తాజాగా పీసీబీ యాంటీ కరప్షన్ యూనిట్ ముందు హాజరైన షార్జిల్కు దేశవాళీ ఈవెంట్లలో ఆడటానికి అనుమతి లభించింది.
పీసీబీ తాజా అనుమతితో త్వరలో ఆరంభం కానున్న పీఎస్ఎల్లో షార్జిల్ ఆడనున్నాడు. పీఎస్ఎల్ ఆటగాళ్ల డ్రాఫ్ట్లో షార్జిల్ భాగం కానున్నాడు. 2017లో దుబాయ్లో నిర్వహించిన పీఎస్ఎల్ రెండో సీజన్లో షార్జీల్ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో షార్జిల్పై ఐదేళ్ల నిషేధం విధిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. కాగా.. తిరిగి తన కెరీర్ను కొనసాగించేందుకు బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. దీంతో అతనిపై ఉన్న నిషేధాన్ని రెండేళ్లకే పరిమితం చేశారు.
ప్రస్తుతం షార్జిల్పై నిషేధం ముగిసింది. దాంతో అతడు తన కెరీర్ను తిరిగి కొనసాగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. నిషేధం గడువు ముగిసిన అనంతరం రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్కి కూడా ఎంపికయ్యాడు. 'నా వల్ల ఇబ్బంది పడ్డ పీసీబీకి, సహచరులకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు క్షమాపణలు. ఇప్పటి నుంచి బాధ్యతాయుతంగా ఉండి భవిష్యత్లో మంచి ప్రదర్శన చేస్తానని హమీ ఇస్తున్నా' అంటూ షార్జీల్ పేర్కొన్నాడు.
షార్జీల్ ఖాన్ పాకిస్తాన్ తరఫున 25 వన్డేలు, ఒక టెస్టు, 15 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. షార్జీల్పై నిషేధం ముగిసినా.. సహచరులు ఖలీద్ లతీఫ్, మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ నవాజ్, నసీర్ జెంషెడ్, షహ్జైబ్ హసన్లపై ఇంకా కొనసాగుతోంది. పాక్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడడం ఓ అలవాటుగా మారింది. ఎంత మంది స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి కెరీర్ నాశనం చేసుకుంటున్నా.. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. అయినా పీసీబీ మాత్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదు.