
హైదరాబాద్: ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తనను కోనుగోలు చేయకపోవడం ఎంతో నిరాశకు గురి చేసిందని టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. గత కొన్నినెలలుగా టీమిండియా వన్డే, టీ20 జట్టులో చోటు కోల్పోయిన అశ్విన్ ప్రస్తుతం దేశవాళీ టోర్నీ విజయ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున ఆడుతున్నాడు.
ఈ సందర్భంగా అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ 'అవును, నిరాశకు గురయ్యా. గత పదేళ్లుగా ఆ జట్టుతో అనుబంధం ఉంది. చెపాక్లో నాకంటూ స్పేస్ ఉంది. నేను బౌలింగ్ వేసేందుకు వెళ్లిన ప్రతిసారీ అభిమానులు ఎంతో ఉత్సాహాపరుస్తారు. అది మిస్సయ్యా. వేలం జరిగిన తీరుని చూస్తే మనం అనుకున్నది జరిగేలా కనిపించలేదు. వేలంలో చెన్నై తనను కోనుగోలు చేయకపోవడంతో నిరాశకు గురయ్యా' అని అన్నాడు.
ఇక, వేలంలో అశ్విన్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 7.6 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చెపాక్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరుపున ఆడటంపై కూడా అశ్విన్ స్పందించాడు. 'ఈ ఫీలింగ్ నిజంగా అద్భుతం. సొంత ప్రేక్షకుల మధ్య నా స్కిల్స్ను మరోసారి నిరూపించుకునేందుకు ఇదొక గొప్ప ఛాన్స్. చెపాక్లో నాకు ఎన్నో మధురస్మృతులు ఉన్నాయి' అని అశ్విన్ తెలిపాడు.

ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సఫారీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా అశ్విన్ స్పందించాడు. కోహ్లీ మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. ఓటమి గురించి అసలు ఆలోచించడని అశ్విన్ చెప్పుకొచ్చాడు. సఫారీ గడ్డపై జట్టుని విరాట్ కోహ్లీ సమర్థంగా నడిపిస్తున్నాడని కితాబిచ్చాడు.
'కోహ్లీ ఎప్పుడూ గెలుపు కోసం పరితపిస్తుంటాడు. అతనికి అసలు ఓటమి ఆలోచనలే రావు. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా సరే.. విజయం గురించే మాట్లాడతాడు. ఇది జట్టులోని ఆటగాళ్లలో మరింత స్ఫూర్తి రగిలిస్తోంది. టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్గా విరాట్ కోహ్లికి ఇదే తొలి దక్షిణాఫ్రికా పర్యటన' అని అశ్విన్ అన్నాడు.
'ఒకరకరంగా చెప్పాలంటే కోహ్లీకి ఇది తొలి విదేశీ పర్యటన. ఇప్పటి వరకు భారత జట్టు అత్యుత్తమ కెప్టెన్లందరూ స్వదేశంలో మంచి రికార్డులు నెలకొల్పి విదేశాల్లో తమ నాయకత్వాన్ని పరీక్షించుకున్నారు. కోహ్లీ కూడా ఇప్పటికే స్వదేశంలో విజయవంతమైన కెప్టెన్గా నిరూపించుకున్నాడు. ఇప్పుడు సఫారీ గడ్డపై సత్తా చాటుతున్నాడు' అని అశ్విన్ వివరించాడు.
కాగా, ఆరు వన్డేల సిరిస్లో భారత్ ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే కేప్టౌన్ వేదికగా బుధవారం జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.