హైదరాబాద్: అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న టీమిండియాను కట్టడి చేయడం కష్టమేనని న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ సట్నర్ అన్నారు. మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇరు జట్ల మధ్య తొలి వన్డే అక్టోబర్ 22న ముంబైలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మిటెల్ సట్నర్ మీడియాతో మాట్లాడుతూ వేగంగా బంతులు విసిరి బ్యాట్స్మెన్ను పొరపాట్లు చేయించడంలోనే విజయం దాగుందని తెలిపాడు.

'టీమిండియాకు బౌలింగ్ చేయడం చాలా కష్టం. స్పిన్ను అద్భుతంగా ఆడగలరు. వారు అందులోనే పుట్టి పెరిగారు. నేను సింపుల్గా బౌలింగ్ చేయడానికే ప్రయత్నిస్తా. సరైన ప్రాంతంలో బంతిని త్వరగా విసిరి బ్యాట్స్మన్ పొరపాటు చేసేలా చేస్తా. అలా బంతులు వేస్ట్ చేసి ఒత్తిడి పెంచితే వికెట్లు తీయడం సులభం' అని అన్నారు.
'నేనదే చేయబోతున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమైన బ్యాట్స్మన్ అయిన కోహ్లీకి బంతులేయడం చాలా కష్టం. అతడే కాదు ప్రస్తుతం టీమిండియా పటిష్టంగా ఉంది. ఆస్ట్రేలియాపై కూడా చక్కగా ఆడారు. గతేడాది ఇక్కడ బాగానే ఆడాం. ఇప్పుడూ అలాంటి మంచి ప్రదర్శనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఉపఖండంలో నాకున్న అనుభవం ఉపయోగించి బౌలింగ్ చేస్తా' అని సట్నర్ అన్నాడు.