ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ను అవమానించలేదు. ప్రేమ, ఆనందం, వినోదం మాత్రమే ఉన్నాయి అని దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ శంషీ పేర్కొన్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో టీ-20లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 135 పరుగుల విజయ లక్ష్యంను దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది.
IND vs SA: ప్రపోజ్ చేసిన అభిమాని.. సిగ్గుపడ్డ రిషబ్ పంత్ (వీడియో)
ఈ మ్యాచ్లో మరో ఓపెనర్ రోహిత్ శర్మ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినా.. శిఖర్ ధావన్ దూకుడుగా ఆడాడు. ఆరో ఓవర్లో ధావన్ రెండు సిక్సులు బాది జోరుమీదున్నాడు. అయితే ఎనిమిదో ఓవర్లో ధావన్ను స్పిన్నర్ శంషీ ఔట్ చేశాడు. ఈ సందర్భంగా శంషీ చేసుకున్న సంబరాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ధావన్ ఔట్ కాగానే.. తన షూ విప్పి చెవి దగ్గర పెట్టుకొని ఫోన్ కాల్ చేసినట్టు అతిగా సంబరాలు చేసాడు.
శంషీ షూ తీసి మరి సంబరాలు చేసుకోవడం ధావన్ను అవమానించినట్టు అనిపించింది. కొందరు అభిమానులు అయితే శంషీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదే స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. దీంతో తాజాగా శంషీ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చుకున్నాడు. 'అగౌరవానికి తావులేదు. కేవలం ప్రేమ, ఆనందం, వినోదం మాత్రమే ఉన్నాయి. తొలి రెండు బంతులని ఎందుకు కొట్టలేదని అతడిని అడిగాను' అని శంషీ ట్వీట్ చేశాడు. అంతేకాదు ధావన్తో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో ఒకటి పోస్ట్ చేశాడు.
No disrespect... only love, enjoyment and entertainment! 🙏
— Tabraiz Shamsi (@shamsi90) 24 September 2019
Asked the big man why he didnt give me a warning atleast before smoking me out of the park 1st two balls lol 😂#DefinitelyWokeMeUp #GottaHaveSomeFunAtWork pic.twitter.com/wdLWN5ks9p
మూడో టీ20లో టీమిండియా ఓడిపోగా.. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్లో ప్రొటీస్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. టీ20 సిరీస్ను డ్రాగా ముగించిన టీమిండియా.. టెస్టు సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అక్టోబర్ 2 నుండి విశాఖలో తొలి టెస్టు జరుగనుంది. త్వరలో దక్షిణాఫ్రికా, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గురువారం ప్రారంభం కానుంది. మిడిల్ ఆర్డర్లో ఒడిదొడుకుల మధ్య సాగుతున్న టెస్టు కెరీర్ను దక్షిణాఫ్రికా సిరీస్తో అందివచ్చిన ఓపెనింగ్ అవకాశంతో సుస్థిరం చేసుకోవాలని టీమిండియా పరిమిత ఓవర్ల స్టార్ రోహిత్ శర్మ పట్టుదలగా ఉన్నాడు. వర్షం కారణంగా వార్మప్ మ్యాచ్ టాస్ ఇంకా పడలేదు.