టీ20 వరల్డ్ కప్-2024లో వరుణుడు మరో మ్యాచ్కు ఆటంకం కలిగించాడు. ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన శ్రీలంక-నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వరుణుడు ప్రతాపానికి కనీసం టాస్ కూడా పడలేదు. మ్యాచ్ను కనీసం అయిదు ఓవర్ల పాటు అయినా నిర్వహించాలనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ అందిస్తూ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
ఈ మెగాటోర్నీలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవ్వడం ఇది రెండో సారి. గ్రూప్-బీలో ఉన్న స్కాట్లాండ్-ఇంగ్లండ్ మ్యాచ్ కూడా వర్షం వల్ల తుడిచిపెట్టుకుంది. అయితే సూపర్-8కు చేరుకోవాలనుకున్న లంక ఆశలకు వరుణుడు నీళ్లు చెల్లాడు. గ్రూప్-డీలో ఉన్న లంక అంతకుముందు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.

ఇక లీగ్ స్టేజ్లో నెదర్లాండ్స్తో శ్రీలంక తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో గెలిస్తే గరిష్టంగా మూడు పాయింట్లతో లీగ్ దశను ముగిస్తుంది. ఇప్పటికే గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా (6 పాయింట్లు), బంగ్లాదేశ్ (2 పాయింట్లు), నెదర్లాండ్స్ (2 పాయింట్లు) సాధించాయి. అంతేగాక బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా శ్రీలంక పాయింట్లను అధిగమించి కనిష్ఠంగా నాలుగు పాయింట్లతో బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ లీగ్ దశను ముగిస్తుంది.
దీంతో లంక టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. అయితే సూపర్-8కు చేరుకోవడానికి శ్రీలంకకు ఓ అవకాశం ఉంది. కానీ అది జరగాలంటే వరుణుడు తన ప్రతాపంతో మరో మ్యాచ్ రద్దు చేయాలి. బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే లంకకు ఛాన్స్ ఉంటుంది. రద్దుతో పాటు మిగిలిన మ్యాచ్లో బంగ్లా, నెదర్లాండ్స్ కచ్చితంగా ఓటమిపాలవ్వాలి. మరోవైపు నెదర్లాండ్స్ జరిగే ఆఖరి మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించాలి. అప్పుడు లంక సూపర్-8కు తప్పక చేరుతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా సూపర్-8కు అధికారికంగా అర్హత సాధించింది.