టీ20 వరల్డ్ కప్లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత్ సూపర్-8కు చేరింది. సునాయాసంగా లీగ్ స్టేజ్ను అధిగమిస్తుందనుకుంటే కష్టంతోనే తొలి దశను దాటింది. ఆడిన మూడింట్లో గెలిచింది. కానీ టీమిండియా అభిమానులు అసంతృప్తితోనే ఉన్నారు. మందకొడి పిచ్పై బ్యాటర్లు విఫలమయ్యారు. ఒక్కో మ్యాచ్లో ఓ బ్యాటర్ నిలబడటం, మిగిలిన పనిని బౌలర్లు పూర్తి చేయడంతో ఇండియా విజయతీరాలకు చేరింది.
అయితే తొలి రెండు మ్యాచ్లు అనంతరం శివమ్ దూబెపై విమర్శలు వెల్లువెత్తాయి. రింకూ సింగ్ను కాదని దూబెను వరల్డ్ కప్కు ఎంపిక చేయడం సెలక్టర్లు చేసిన పెద్ద తప్పు అని నెట్టింట చర్చ జోరుగా సాగింది. అంతేగాక అమెరికాతో జరిగిన మ్యాచ్లో దూబెకు బదులుగా సంజు శాంసన్ను తీసుకోవాలని డిమాండ్ వినిపించింది. కానీ దూబెపై నమ్మకం ఉంచిన టీమిండియా మేనేజ్మెంట్ ప్రతిఫలాన్ని పొందింది. సూర్యకుమార్ యాదవ్తో కలిసి దూబె కీలక ఇన్నింగ్స్ ఆడి యూఎస్ఏపై జట్టును గెలిపించాడు.

బుధవారం నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. మొదట అమెరికా ఎనిమిది వికెట్లకు 110 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (27; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. అర్షదీప్ సింగ్ (4/9) నాలుగు వికెట్లతో చెలరేగాడు. అనంతరం ఛేదనలో భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. సూర్య (50 నాటౌట్, 49 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), దూబె (31 నాటౌట్; 35 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) జట్టును గెలిపించాడు.
కాగా, దూబె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అమెరికా మ్యాచ్ ముంగిట తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపాడు. ప్రపంచకప్ ప్రారంభంలో ఫామ్లేమితో ఇబ్బంది పడ్డానని, కానీ జట్టు తనపై నమ్మకం ఉంచిందని అన్నాడు. కోచ్లు, సహాయక సిబ్బంది తనకు సాయం చేశారని పేర్కొన్నాడు. ఐపీఎల్లో దూకుడుగా ఆడినట్లు కఠిన పిచ్పై సిక్సర్లు కొట్టలేమని, అందుకే భిన్నంగా ఆడేందుకు ప్రయత్నించానని దూబె వెల్లడించాడు. పిచ్ ప్రభావంతో రంజీ ట్రోఫీ ఆడిన అనుభూతి కలిగిందని అన్నాడు.
మరోవైపు విరాట్ కోహ్లి గత స్కోర్లు 1, 4, గోల్డెన్ డకౌట్పై దూబె మాట్లాడుతూ.. కింగ్ కోహ్లి తర్వాతి మూడు మ్యాచ్ల్లో సెంచరీ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ''విరాట్ కోహ్లి గురించి చెప్పడానికీ ఏం లేదు. నేను కోహ్లిని కాదు. కానీ కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా ఔట్ కావాల్సిన పరిస్థితులు కలుగుతాయి.అయితే రాబోయే మూడు మ్యాచ్ల్లో కోహ్లి సెంచరీలతో విరుచుకుపడతాడు. అతని ఆట ఏంటో మనకి తెలుసు'' అని దూబె అన్నాడు.