టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచి విశ్వవిజేతగా సత్తాచాటింది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో గెలుపు టీమిండియాకు అంత సులువుగా దక్కలేదు. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ తమ పోరాటంతో భారత్ను ఓడించేంత పనిచేశారు. కానీ రోహిత్ సేన గొప్పగా పుంజుకుని అంతిమంగా విజయతీరాలకు చేరింది.
భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్ ఫైనల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. దక్షిణాఫ్రికా పైచేయి సాధిస్తున్న సమయంలో భారత ఆటగాళ్ల పరిస్థితి గురించి అక్షర్ వివరించాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (46), అక్షర్ (47) పరుగులు చేశాడు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. క్లాసెన్ (52), డేవిడ్ మిల్లర్ (21) పోరాడారు.

అయితే ఛేదనలో దక్షిణాఫ్రికా 14 ఓవర్లకు 123/4తో నిలిచింది. కానీ 15వ ఓవర్ వేసిన అక్షర్ బౌలింగ్లో క్లాసెన్ చెలరేగాడు. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. మ్యాచ్ను మలుపు తిప్పాడు. అనంతరం ధారళంగా పరుగులు సమర్పించుకున్న తాను ఎంతో నిరాశచెందానని, ఇక మ్యాచ్ కోల్పోయాని భావించాని అక్షర్ చెప్పాడు.
''ఓ అయిదు సెకన్ల పాటు.. ఇక మ్యాచ్ కోల్పోయామనుకున్నా. ఎంతో నిరుత్సాహపడ్డాను. కానీ తిరిగి పుంజుకుంటామని మనస్సు చెప్పింది. అయితే అప్పుడు రోహిత్ నా దగ్గరకు వచ్చాడు. 'మ్యాచ్ ఇంకా అయిపోలేదు' అని నాతో అన్నాడు. ద్వైపాక్షిక సిరీస్ అయితే ఓ బ్యాటర్ మనపై చెలరేగితే నిరాశతో ఢీలా పడిపోతాం. ఆశలు వదులుకుంటాం. కానీ ఫైనల్లో మేం అలా చేయలేదు. ఓటమి అంగీకరించలేదు. ఆఖరి ఓవర్ చివరి బంతి వరకు మ్యాచ్ను తీసుకోని వెళ్లాలని పోరాడాం'' అని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు.