అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచుల్లో భయంలో లేకుండా ఆడతామని భారత ఆటగాడు సురేష్ రైనా చెప్పాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో మొదటి టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. కాగా, 4-1తో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టులో సురేష్ రైనా లేడు.
ఈ నేపథ్యంలో సురేష్ రైనా మాట్లాడుతూ.. ఈ పొట్టి ఆటలో తాము భయం లేకుండా ఆడతామని చెప్పాడు. 'సిరీస్ ప్రారంభం నుంచే బాగా ఆడాలని కోరుకుంటున్నా. అదే జట్టుకు ముఖ్యం. భయం లేకుండా ఆడటమే మా లక్ష్యం' అని బిసిసిఐ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

'వన్డే సిరీస్ అయిపోయింది. ఇది కొత్త ఆరంభం. సానుకూల దృక్పథంతో ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తాం' అని రైనా పేర్కొన్నాడు. వన్డే సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఆ జట్టుపై గెలుపే లక్ష్యంగా ఆడతామని చెప్పాడు.
ప్రత్యర్థి జట్టు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాడు. 29ఏళ్ల రైనా అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో మరో 17 పరుగులు పూర్తి చేస్తే 1000 పరుగుల క్లబ్లో చేరతాడు. ఇప్పటి వరకు భారత్ తరపున 46 టీ20 మ్యాచులు ఆడాడు. రైనాతోపాటు రోహిత్ శర్మ మాత్రమే అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో భారత్ తరపున సెంచరీలు సాధించారు.