మరో 26 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఈ మహా సమరంలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా ఈ సారి పొట్టి కప్ను ముద్దాడాలని సెలక్టర్లు ఎంతో తీవ్రంగా ఆలోచించి జట్టును ఎంపిక చేశారు. సెలక్ట్ చేసిన టీమ్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
రింకూ సింగ్, సందీప్ శర్మ, నటరాజన్ వంటి ఆటగాళ్లను జట్టులో ఎంపిక చేయాలని డిమాండ్ వినిపించింది. అలాగే హార్దిక్ పాండ్య వంటి ఫామ్లో లేని ఆటగాళ్లను ఎలా సెలక్ట్ చేశారనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే టీమ్ను ప్రకటించిన తర్వాత అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఎంపికైన ఆటగాళ్లలో కొందరు ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నారు. యుజువేంద్ర చాహల్ తన కెరీర్లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న స్పెల్ వేశాడు. అర్షదీప్ సింగ్ సైతం ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు.

అంతకుముందు వరకు ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడిన శివమ్ దూబె వరుసగా రెండు సార్లు గోల్డెన్ డకౌటయ్యాడు. దీంతో అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఆటగాళ్లకు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పేలవ ప్రదర్శన చేసిన దూబె, అర్షదీప్ సింగ్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
''భారత జట్టులో ఎంపికైన ఆటగాళ్లకు ఏమైంది? శివమ్ దూబె వరుసగా రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రెండు సార్లు ఒకే జట్టుపై స్పిన్నర్ల చేతిలో ఇలా ఔటయ్యాడు. దూబెను మొదటిసారి హర్ప్రీత్ బ్రార్, రెండో సారి రాహుల్ చాహర్ ఔట్ చేశారు. ఇక సీఎస్కే ఇన్నింగ్స్ విషయానికొస్తే.. పవర్ప్లేలో 60/1తో నిలిచింది. కానీ ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది''
''డారిల్ మిచెల్ను హర్షల్ పటేల్, మొయిన్ అలీని సామ్ కరన్ ఔట్ చేశారు. రవీంద్ర జడేజా ఆఖరి వరకు నిలబడ్డాడు. కానీ సీఎస్కే ఇన్నింగ్స్ ఏ దశలోనూ జోరుగా సాగలేదు. ఇక పంజాబ్ కింగ్స్లో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. కానీ అదే స్టోరీ రిపీట్ అయ్యింది. అతను పరుగులు సమర్పించుకున్నాడు. టీమిండియాకు ఎంపికైన తర్వాత ప్రతి ఒక్కరికి ఏమైతుంది? 167 స్కోరు నమోదైన మ్యాచ్లో అర్షదీప్ 10కి పైగా ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు'' అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు. కాగా, పంజాబ్పై సీఎస్కే 28 పరుగుల తేడాతో గెలిచింది.