టీ20 వరల్డ్ కప్-2024లో హోరాహోరీ మ్యాచ్లకు వేళైంది. ఇవాళ నుంచి సూపర్-8 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పోరులపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులను కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. సూపర్-8 మ్యాచ్లకు రిజర్వ్ డే ఉందా? ఒక వేళ అన్ని మ్యాచ్లు రద్దయితే ఎలా? సెమీఫైనల్స్కు చేరే జట్లను ఐసీసీ ఎలా నిర్ణయిస్తుంది? అనే సందేహాలు వస్తున్నాయి.
లీగ్ దశలో సత్తాచాటిన ఎనిమిది జట్లను సూపర్-8లో రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్; అలాగే గ్రూప్-2లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా ఉన్నాయి. ఆయా గ్రూప్ల్లో నిలిచిన టాప్-2 జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా ఫేవరేట్ టీమ్స్గా ఉన్నాయి. వరుణుడు ఆటంకం కలిగించకపతో ఈ రెండు జట్లు సునాయాసంగా సెమీస్కు దూసుకెళ్తాయి.

కానీ ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్లు రద్దయితే భారత్ లేదా ఆస్ట్రేలియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లీగ్ దశలో స్కాట్లాండ్ మ్యాచ్ రద్దవ్వడంతో గ్రూప్-బీలో ఉన్న ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఎందుకంటే ఆ పోరులో ఇంగ్లండ్ హాట్ ఫేవరేట్. కానీ మ్యాచ్ రద్దవ్వడంతో ఈజీగా వచ్చే ఓ పాయింట్ కోల్పోయింది. అయితే భారత్ ఆడే మ్యాచ్లకు వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
రిజర్వే డే ఉందా?
సూపర్-8 మ్యాచ్కు ఐసీసీ రిజర్వ్డే కేటాయించలేదు. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. ఒకవేళ భారత్ ఆడే అన్ని మ్యాచ్లు వరుణుడి వల్ల రద్దయితే మూడు పాయింట్లు సాధిస్తుంది. గ్రూప్-1లో ఏదైనా ఓ జట్టు (ఆస్ట్రేలియా) మినహా.. మిగిలిన టీమ్స్ మూడు కంటే తక్కువ పాయింట్లు సాధిస్తే భారత్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆసీస్తో కలిసి సెమీస్కు చేరుతుంది. కానీ అలా జరగడం దాదాపు అసాధ్యమే.
నెట్ రన్ రేటు కూడా సమానమైతే?
ఒకవేళ అఫ్గానిస్థాన్ లేదా బంగ్లాదేశ్ కూడా భారత్తో మూడు పాయింట్లు సాధిస్తే నెట్రన్రేటును పరిగణనలోకి తీసుకుంటారు. వర్షం కారణంగా అన్ని మ్యాచ్లు రద్దయిన టీమిండియాకు ఎలాంటి రన్రేటు (0) ఉండదు. ఈ సందర్భంలో బంగ్లా లేదా అఫ్గాన్కు పాజిటివ్ నెట్రన్రేటు ఉంటే ఆ జట్టునే సెమీస్కు క్వాలిఫై చేస్తారు. ఈ పరిస్థితిలో భారత్కు నిరాశే మిగులుతుంది.
ఒకవేళ బంగ్లాదేశ్ లేదా అఫ్గానిస్థాన్ కూడా జీరో నెట్ రన్ రేటుతో ఉంటే టీ20 ర్యాంకుల ఆధారంగా లేదా హెడ్ టు హెడ్ మ్యాచ్ల్లో మెరుగైన రికార్డు ఉన్న జట్టుకు అవకాశం ఇస్తారు. మే 31వ తేదీన ఉన్న టీ20 ర్యాంకులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పరిస్థితులో భారత్కు మేలు జరుగుతుంది.