టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. బార్బడోస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో చెలరేగింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓటమితో జరిగిన నష్టాన్ని ఈ మ్యాచ్తో సరిచేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన యునైటెడ్ స్టేట్స్ 19.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీస్ గౌస్ (29; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.
వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ (3/19, రసెల్ (3/31) చెరో మూడు వికెట్లు, అల్జారీ జోసెఫ్ (2/31) రెండు వికెట్లతో సత్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన అమెరికాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ స్టీవన్ టేలర్ (2; 7 బంతుల్లో)ను రెండో ఓవర్లో రసెల్ ఔట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన నితీశ్ కుమార్ (20; 19 బంతుల్లో, 2 ఫోర్లు)తో కలిసి ఆండ్రీస్ గౌస్ దూకుడుగా ఆడటంతో యూఎస్ఏ పవర్ప్లేలో 48 పరుగులు సాధించింది. కానీ ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయింది.

రోస్టన్ ఛేజ్ ధాటికి 51/1తో ఉన్న అమెరికా 65 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మిలింద్ కుమార్ (19; 21 బంతుల్లో, 1 ఫోర్), షాడ్లీ (18; 17 బంతుల్లో, 3 ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించినా విండీస్ బౌలర్లు ఛాన్స్ ఇవ్వలేదు. అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 10.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి ఘన విజయం సాధించింది. ఓపెనర్ షై హోప్ (82 నాటౌట్; 39 బంతుల్లో, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. నికోలస్ పూరన్ (27; 12 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
షై హోప్ తొలుత నిదానంగా ఆడాడు. కుదురుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. నోస్తుష్ బౌలింగ్లో సిక్సర్ సాధించిన తర్వాత జోరు అందుకున్నాడు. ఓవర్కు కనీసం రెండు బంతుల చొప్పున బౌండరీలు బాదాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (15; 14 బంతుల్లో, 2 ఫోర్లు) బంతికో పరుగు చొప్పున ఆడినా హోప్ దూకుడుతో వెస్టిండీస్ పవర్ప్లేలో 58 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో జాన్సన్ను హర్మీత్ సింగ్ ఔట్ చేయడం అమెరికానే దెబ్బతీసింది.
వన్డౌన్లో వచ్చిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. షై హోప్ ఊచకోతకు పూరన్ తోడవ్వడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో 11 ఓవర్లలోపే విండీస్ లక్ష్యాన్ని ఛేదించింది. వెస్టిండీస్ ఛేదనలో 11 సిక్సర్లు, ఏడు ఫోర్లు నమోదయ్యాయి.