టీ20 వరల్డ్ కప్లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్ వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. ట్రిండాడ్ వేదికగా గురువారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టి 13 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో సూపర్-8కు అర్హత సాధించింది. మరోవైపు ఓటమిపాలైన న్యూజిలాండ్ తదుపరి దశకు చేరుకోవడానికి అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయించింది. కానీ అద్భుత పోరాటంతో వెస్టిండీస్ తిరిగి పోటీలోకి వచ్చి మ్యాచ్ను గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. షెర్ఫాన్ రూథర్ఫర్డ్ (68 నాటౌట్; 39 బంతుల్లో, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ అర్థశతకంతో చెలరేగాడు. బౌల్ట్ (3/16) మూడు, సౌథి (2/21), ఫెర్గూసన్ (2/27) చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు.

అయితే టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన వెస్టిండీస్ 30 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ నుంచే వికెట్ల వేట మొదలుపెట్టిన కివీస్ బౌలర్లు విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రూథర్ఫర్డ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో స్కోరుబోర్డు ముందుకు నడిపించి పోరాడే లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచాడు. కాగా, అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులే చేసింది.
గ్లెన్ ఫిలిప్స్ (40; 33 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మిచెల్ శాంట్నర్ (21 నాటౌట్; 12 బంతుల్లో, 3 సిక్సర్లు) ఆఖర్లో దూకుడుగా ఆడాడు. అల్జారీ జోసెఫ్ (4/19), మొటియ్ (3/25) సత్తాచాటారు. ఛేదనలో ఏ దశలోనూ న్యూజిలాండ్ ఫేవరేట్గా కనిపించలేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలోకి వెళ్లింది. ఫిలిప్స్ క్రీజులో నిలిచినప్పటికీ లక్ష్యం దిశగా కివీస్ సాగలేదు. అయితే ఆఖరి ఓవర్లో విజయానికి 33 పరుగులు అవసరమవ్వగా శాంట్నర్ మూడు సిక్సర్లు బాది ఓటమి అంతరాన్ని తగ్గించాడు.