టీ20 వరల్డ్ కప్లో హైవోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో భారత్ ఇవాళ తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఆసక్తికర పోరుకు గయానా వేదిక కానుంది. అయితే 2022 సెమీస్లో తాము ఓడించిన భారత్ జట్టు ఇది కాదని, ఇప్పటి టీమిండియా అరవీర భయంకరంగా ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు.
2022 టీ20 వరల్డ్ కప్లో కూడా భారత్, ఇంగ్లండ్ సెమీస్లో తలపడిన విషయం తెలిసిందే. అయితే ఆ పోరులో ఇంగ్లిష్ జట్టు పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అయితే ఆ ఓటమి తర్వాత భారత జట్టు పూర్తిగా మారిపోయిందని, దూకుడు మంత్రంతో సత్తాచాటుతుందని బట్లర్ తెలిపాడు.

ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో కూడా భారత్ అదే ఫార్ములాతో సత్తాచాటిందని బట్లర్ పేర్కొన్నాడు. అయితే రోహిత్సేనను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని, అదే రీతిలో సమాధానమిస్తామని చెప్పాడు. ''ఈ సెమీఫైనల్లో భిన్నమైన భారత్తో ఆడనున్నాం. రోహిత్ జట్టును నడిపించిన తీరు, బ్యాటర్ల ఆడే విధానాన్ని చూస్తుంటే వాళ్లు స్వేచ్ఛగా ఆడుతూ దూకుడైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు''
''2022 టోర్నమెంట్ తర్వాత భారత జట్టు మారిపోయిందనిపిస్తుంది. వన్డే వరల్డ్ కప్లో సత్తాచాటారు. విశ్వాసంతో విరుచుకుపడుతున్నారు. అయితే దానికి బదులివ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వాళ్లు దూకుడుగా ఆడతారని మాకు తెలుసు. అదే రీతిలో మేమూ ఆడతాం'' అని జోస్ బట్లర్ పేర్కొన్నాడు. కాగా, ఈ ప్రపంచకప్లో భారత్ ఓటమెరుగలేదు. గ్రూప్, సూపర్-8 స్టేజ్లో వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా సెమీస్కు చేరింది.
తుది జట్టు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లివింగ్స్టోన్, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్/మార్క్వుడ్, టోప్లే.