టైటిల్ వేట కోసం టీ20 వరల్డ్ కప్లో ఎన్నో అంచనాల మధ్య బరిలో దిగిన భారత్ తొలి దశను అధిగమించింది. సునాయాసంగా లీగ్ స్టేజ్ను అధిగమించాల్సిన టీమిండియా కాస్త కష్టంగా దాటింది. మొత్తంగా హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకుంది. అయితే భారత అభిమానులను విరాట్ కోహ్లి ఫామ్ తీవ్రంగా కలవరపెడుతోంది. సూపర్ ఫామ్తో మెగాటోర్నీలో అడుగుపెట్టిన కోహ్లి రెండంకెల స్కోరును అందుకోలేకపోతున్నాడు.
ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో అయిదు బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కవర్ డ్రైవ్కు ప్రయత్నించి మూడు బంతుల్లో నాలుగు పరుగులకే ఔటయ్యాడు. ఇక అమెరికాతో జరిగిన పోరులో మొదటి బంతికి ఔటై గోల్డెన్ డకౌట్గా పెవిలియన్కు చేరాడు. అయితే కోహ్లి భారత్ తరఫున గతంలో సాధించిన రికార్డులన్నీ వన్డౌన్లో చేసినవే.

అయితే ఐపీఎల్లో ఓపెనర్గా విరాట్ కోహ్లి పరుగుల వరద పారించాడు. అదే జోరులో ప్రపంచకప్లోనూ సత్తాచాటుతాడని టీమిండియా మేనేజ్మెంట్ కింగ్ కోహ్లిని ఓపెనర్గా బరిలోకి దించుతోంది. కానీ సీన్ రివర్స్ అయింది. దూకుడుగా ఆడాలనే ఆలోచనతో కోహ్లి వికెట్ను త్వరగా సమర్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తిరిగి వన్డౌన్లో బ్యాటింగ్ చేయాలని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించాడు.
''మూడో స్థానంలో విరాట్ కోహ్లి తన సహజ సిద్ధంగా ఆడతాడు. కుదురుకోవడానికి సమయాన్ని తీసుకుని మ్యాచ్ను అర్థం చేసుకుంటాడు. 50-60 పరుగులతో ఉన్నతంగా నిలుస్తాడు. గత వరల్డ్ కప్లో కోహ్లి గణాంకాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే మూడో స్థానం నుంచి రిషభ్ పంత్ అయిదో స్థానానికి వెళ్లాలి. లేదంటే రోహిత్తో కలిసి ఓపెనర్గా రావాలి. అలా అయితే ఓపెనింగ్లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ వస్తుంది. కోహ్లి మూడో స్థానంలో రావాలి. సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో కొనసాగాలి'' అని మహ్మద్ కైఫ్ అన్నాడు.