వన్డే వరల్డ్ కప్ను తృటిలో చేజార్చుకున్న భారత్ టీ20 ప్రపంచకప్లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగింది. అంచనాలకు తగ్గట్లుగానే రాణిస్తూ ఆడిన రెండింట్లో గెలిచింది. పసికూన ఐర్లాండ్పై సునాయాసంగా గెలిచి, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై చెమటోడ్చింది. నాలుగు పాయింట్లు సాధించి గ్రూప్-ఏలో టేబుల్ టాప్లో నిలిచి, సూపర్-8 రేసులో ముందంజలో ఉంది.
అయినా టీమిండియా అభిమానులను ఓ అంశం తీవ్రంగా కలవరపెడుతోంది. అదే జట్టు కూర్పు! ఐపీఎల్లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ను అందుకున్న విరాట్ కోహ్లిని ఓపెనర్గా దించుతున్నారు. ఐపీఎల్లో ఆ స్థానంలో సత్తాచాటిన కోహ్లి మెగాటోర్నీలో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. పొట్టి కప్లో ఛేజింగ్లో అసాధారణ రికార్డులు ఉన్న కోహ్లి ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో అయిదు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేశాడు.

ఇక పాకిస్థాన్తో మ్యాచ్ అంటే పగతో ఆడుతున్నట్లుగా ప్రతాపం చూపే కోహ్లి ఈ సారి మూడు బంతుల్లో నాలుగు పరుగులే చేసి వెనుదిరిగాడు. అయితే ఓపెనర్గా రెండు అవకాశాలను చూసే విరాట్ ప్రదర్శన తక్కువ చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఓ ఎండ్లో కోహ్లి వంటి అనుభవజ్ఞుడు క్రీజులో ఉంటే భారత్ కచ్చితంగా మెరుగైన స్కోరు సాధించేది. స్లో పిచ్లపై సందర్భాన్ని బట్టి గేర్ మార్చడంలో విరాట్ మాష్టర్.
కానీ ఓపెనర్ రోల్ ఇవ్వడంతో పిచ్తో సంబంధం లేకుండా హిట్టింగ్ చేయాలనుకునే క్రమంలో తన విలువైన వికెట్ను సునాయాసంగా చేజార్చుకుంటున్నాడు. లీగ్ స్టేజ్లో విరాట్ ఆదిలోనే ఔటైనా కఠిన ప్రత్యర్థి తగలకపోవడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. కానీ సూపర్-8, సెమీస్, ఫైనల్స్లో వెస్టిండీస్లోని స్లో పిచ్లపై విరాట్ ఆఖరి వరకు క్రీజులో ఉండటం జట్టుకు ఎంతో కీలకం. దీంతో రేపు అమెరికాతో జరగనున్న మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత తుది జట్టులో మార్పులు చేయాలని భావిస్తున్నారు.
విరాట్ కోహ్లిని మూడో స్థానంలో కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. దీంతో తుదిజట్టులో యశస్వీ జైస్వాల్ రానున్నాడు. రోహిత్తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో శివమ్ దూబె బెంచ్కే పరిమితం కానున్నాడు. జట్టులో మిగిలిన ఆటగాళ్లను అదే స్థానాల్లో కొనసాగనున్నారు.
భారత తుది జట్టు అంచనా
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా