క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి మరో మెగా టోర్నీ సిద్ధమైంది. రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మహా సమరానికి అమెరికా-వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఇరవై జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయిదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్లుగా విడిపోయి తలపడనున్నాయి.
వన్డే వరల్డ్ కప్ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్ సూపర్-8కు సులువుగా అర్హత సాధిస్తుంది. గ్రూప్ దశలో భారత్, పాకిస్థాన్తో పాటు ఐర్లాండ్, అమెరికా, కెనడాతో ఆడనుంది. దీంతో తదుపరి దశకు చేరుకోవడం ఈజీనే. అయితే సూపర్-8, సెమీస్, ఫైనల్లో భారత్కు అసలైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో టీమిండియాకు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక సూచనలు చేశాడు. విరాట్ కోహ్లి గొప్ప ప్లేయర్ అని, అయితే మెగాటోర్నీలో భారత్ సత్తాచాటాలంటే కోహ్లి ఐపీఎల్ తరహాలో స్వేచ్ఛగా ఆడాలని పేర్కొన్నాడు. రోహిత్తో కలిసి ఓపెనర్ బరిలోకి దిగాలని తెలిపాడు. ఐపీఎల్ రెండో అర్ధభాగంలో కోహ్లి దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన విరాట్ 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు.
''విరాట్-రోహిత్ కలిసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించాలి. ఈ ఐపీఎల్ సీజన్ సెకండ్ హాఫ్లో ఆర్సీబీ తరఫున విరాట్ ఎలా ఆడాడో అదే రీతిలో ఆడాలి. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి. కోహ్లి గొప్ప ఆటగాడు అని చెప్పాల్సిన పని లేదు. కానీ భారత్ రాణించాలంటే ఐపీఎల్లో స్వేచ్ఛగా ఆడినట్లే ఆడాలి. టాప్ ఆర్డర్లో కోహ్లి, రోహిత్ కలిసి ఆడాలని భావిస్తున్నా''
''ఈ ప్రపంచకప్లో భారత్ సత్తాచాటుతుందని ఆశిస్తున్నా. టీమిండియాలో నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. ఐపీఎల్ వంటి టోర్నీలతో మంచి ప్రాక్టీస్ సాధించారు. ఇది న్యూయార్క్లో కచ్చితగా జట్టుకు సాయపడుతుంది. అక్కడ పెద్ద మైదానాలు కూడా భారత్కు కలిసొస్తాయి. చిన్న కారణాలతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందనే చెప్పలేరు. ఎందుకంటే జట్టులో గొప్ప ప్లేయర్లు ఉన్నారు'' అని గంగూలీ అన్నాడు.
గ్రూప్ దశ మ్యాచ్ల్నీ భారత్ యూఎస్ఏలోనే ఆడనుంది. న్యూయార్క్లోని నాసా కంట్రీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో రోహిత్ సేన ఆడనుంది.