మరో ఆరు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. వన్డే ప్రపంచకప్ను తృటిలో చేజార్చుకున్న భారత్ పొట్టి కప్ వేటకు బయలుదేరింది. టీ20 కప్ను సాధించి విశ్వవిజేతగా నిలవడానికి రోహిత్ సేన శనివారమే అమెరికాకు పయనమైంది.
అయితే ప్రపంచకప్కు ఎంపికైన భారత ప్లేయర్లు అందరూ నిన్న యునైటెడ్ స్టేట్స్కు బయలుదేరలేదు. ఐపీఎల్ ఫైనల్ ఆదివారంముగియనుండటంతో రెండు బ్యాచ్లుగా అగ్రరాజ్యానికి వెళ్తున్నారు. తొలి బ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివమ్ దూబెతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ శనివారం విమానమెక్కారు.

తొలి బ్యాచ్తో పాటు విరాట్ కోహ్లి కూడా అమెరికాకు బయలుదేరాల్సి ఉంది. కానీ జట్టుతో కలిసి అతను వెళ్లలేదు. కాస్త ఆలస్యంగా అగ్రరాజ్యానికి చేరనున్నాడు. దుబాయ్లో కోహ్లికి వ్యక్తిగత పని ఉండటంతో అతను భారత జట్టుతో చేరడం కాస్త ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి కోహ్లి ముందుగానే తెలియజేశాడు. దీనికి భారత క్రికెట్ బోర్డు అంగీకరించిదని తెలుస్తోంది.
విరాట్ కోహ్లితో పాటు సంజు శాంసన్, హార్దిక్ పాండ్యకు కూడా బీసీసీఐ అనుమతి ఇచ్చిందని సమాచారం. భారత్ నుంచి శాంసన్, లండన్ నుంచి హార్దిక్ కాస్త ఆలస్యంగా అమెరికా పయనమవుతారు. అయితే బంగ్లాదేశ్తో జూన్ 1న జరగనున్న వార్మప్ మ్యాచ్కు కోహ్లి దూరం కానున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముందు భారత్ ఆడే ఏకైక వార్మప్ మ్యాచ్ బంగ్లాతోనే. అమెరికాలోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి భారత ఆటగాళ్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. కానీ ఈ కీలక మ్యాచ్కు కోహ్లి దూరమవ్వనున్నాడు.
''జట్టులో ఆలస్యంగా చేరుతానని కోహ్లి బోర్డుక ముందుగానే తెలియజేశాడు. అందుకే అతని వీసా అపాయిట్మెంట్ను బీసీసీఐ తర్వాత తేదీకి ఉంచింది. మే 30న తెల్లవారుజామున కోహ్లి న్యూయార్క్కు బయలుదేరనున్నాడు. కోహ్లి అభ్యర్థనను బీసీసీఐ అంగీకరించింది'' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా, జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-ఏలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ ఉన్నాయి.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్