లీగ్ స్టేజ్లో సంచలన ప్రదర్శన చేసిన అమెరికా సూపర్-8లో తేలిపోయింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి సెమీఫైనల్స్ అవకాశాలను కష్టతరం చేసుకుంది. అద్భుత ప్రదర్శనతో పాటు అదృష్టం కలిసొస్తేనే ఇక సెమీస్కు చేరుతుంది. బార్బడోస్ వేదికగా శనివారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో యూఎస్ఏ తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
మొదట బ్యాటింగ్ చేసిన యునైటెడ్ స్టేట్స్ 19.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీస్ గౌస్ (29; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ (3/19, రసెల్ (3/31) చెరో మూడు వికెట్లు, అల్జారీ జోసెఫ్ (2/31) రెండు వికెట్లతో సత్తాచాటారు. పవర్ప్లేలో అమెరికా 48/1తో సత్తాచాటినా తర్వాత విండీస్ బౌలర్లు క్రమంగా వికెట్లు తీసి దెబ్బకొట్టారు.

అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 10.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి ఘన విజయం సాధించింది. ఓపెనర్ షై హోప్ (82 నాటౌట్; 39 బంతుల్లో, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. నికోలస్ పూరన్ (27; 12 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్లో 100+ టార్గెట్ను అత్యంత వేగంగా సాధించిన రెండో జట్టుగా వెస్టిండీస్ రికార్డులకెక్కింది.
కాగా, మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమికి గల కారణాలను అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్ వివరించాడు. పేలవమైన బ్యాటింగ్తోనే ఘోర పరాజయాన్ని చవి చూశామని అన్నాడు. ఈ పిచ్పై సగటును చేయాల్సిన స్కోరు కంటే దాదాపు 50 పరుగులు తక్కువగా చేశామని తెలిపాడు. ''ఇవాళ మా ఆటగాళ్లకు ఎంతో కష్టమైన రోజు. 170 నుంచి 180 పరుగులు చేయాల్సింది. కానీ మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోయాం. కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంటుంది''
''అయితే ఆ తర్వాత కోలుకుని అంతిమంగా స్కోరుబోర్డుపై పరుగులు చేయాలి. బంతితో గొప్పగా పోరాడాలనుకున్నాం. పవర్ప్లేలో త్వరగా వికెట్లు తీయాలనుకున్నాం. కానీ వెస్టిండీస్ బ్యాటింగ్ యూనిట్ బలం తెలిసిందే. ఇక ఇంగ్లండ్తో జరిగే సవాలైన మ్యాచ్కు మేం సిద్ధంగా ఉన్నాం'' అని ఆరోన్ జోన్స్ అన్నాడు.