టీ20 వరల్డ్ కప్కు ప్రకటించిన భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫామ్లో ఉన్న ఆటగాళ్లను తప్పించి తమ ఫేవరేట్ ప్లేయర్లను సెలక్టర్లు ఎంపిక చేశారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత జట్టు ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇతర ఆటగాళ్లపై ఉన్న అభిమానంతో రుతురాజ్ గైక్వాడ్కు అన్యాయం చేశారని పేర్కొన్నాడు.
ఫామ్లోని శుభ్మన్ గిల్ను రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేయడాన్ని శ్రీకాంత్ ప్రశ్నించాడు. ఐపీఎల్లో నిలకడగా పరుగులు వరద పారిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ను కాదని గిల్ను ఎలా ఎంపిక చేస్తారని మండిపడ్డాడు. జట్టు ఎంపికలో సెలక్టర్లు అతిగా ఫేవరిటిజమ్ చూపించారని ఆరోపించాడు. ప్రపంచకప్ జట్టులో రింకూ సింగ్ను తప్పించడంపై కూడా మాజీ క్రికెటర్ ఫైర్ అయ్యాడు.

''భారత జట్టులో స్థానం దక్కించుకునే అర్హత రుతురాజ్ గైక్వాడ్కు కచ్చితంగా ఉంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. 17 టీ20 ఇన్నింగ్స్ల్లో 500కు పైగా పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై సెంచరీ కూడా సాధించాడు. మరోవైపు శుభ్మన్ గిల్ ఫామ్లోనే లేడు. కానీ అతను జట్టులో ఎలా ఎంపికయ్యాడు? సెలక్టర్లకు గిల్ అంటే అభిమానం. అతను విఫలమైనా అవకాశాలు వస్తాయి. టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో ఫెయిల్ అయినా గిల్కు జట్టులో స్థానం ఉంటుంది''
''ఎంపిక ప్రక్రియలో ఫేవరిటిజమ్ చాలా ఎక్కువగా ఉంది. జట్టు ఎంపిక మొత్తం అభిమానంతోనే చేశారు. రింకూ సింగ్ విషయానికొస్తే.. అతను దక్షిణాఫ్రికాలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ మీకు గుర్తుందా? టీమిండియా 22కే నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు రింకూ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దేశం తరఫున ఎప్పుడు ఆడే అవకాశం వచ్చినా శక్తివంచన లేకుండా పోరాడాడు. కొందరని సంతృప్తి పరచడానికి ప్రపంచకప్కు జట్టును ఎంపిక చేశారు. మొత్తంగా రింకూను బలిపశువును చేశారు'' అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు.
టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.