భారీ అంచనాల మధ్య మెగా సమరంలో అడుగుపెట్టిన భారత్ సూపర్-8కు చేరుకుంది. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో హోరెత్తించి టీ20 ప్రపంచకప్లో మొదటి దశను దిగ్విజయంగా అధిగమించింది. ఇక లీగ్ స్టేజ్లో కెనడాతో శనివారం తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో గెలిస్తే టేబుల్ టాపర్గా రోహిత్ సేన లీగ్ దశను ముగిస్తుంది.
కెనడాతో మ్యాచ్ అనంతరం భారత జట్టు కరేబియన్ దీవులకు పయనమవుతుంది. అక్కడే సూపర్-8 పోరులతో పాటు సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లోరిడా నుంచి భారత జట్టు వెస్టిండీస్కు బయలుదేరే సమయంలో శుభ్మన్ గిల్, అవేశ్ ఖాన్ స్వదేశానికి తిరిగి రానున్నట్లు సమాచారం.

శుభ్మన్ గిల్, అవేశ్ ఖాన్తో పాటు రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ప్లేయర్లుగా టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన విషయం తెలిసిందే. ఆటగాళ్లు ఎవరైనా గాయపడితే అందుబాటులో ఉండటానికి ఈ యువ ఆటగాళ్లను సెలక్టర్లు జట్టుతో పాటు అదనంగా ఎంపిక చేశారు. అయితే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేస్తుండటంతో యశస్వీ జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్గా బెంచ్కు పరిమితమయ్యాడు. దీంతో ప్రపంచకప్లో గిల్ సేవలు జట్టుకు ఉపయోగపడవని భావించిన యాజమాన్యం అతన్ని ఇండియాకు పంపించడానికి సిద్ధమైంది.
గిల్తో పాటు అవేశ్ ఖాన్ను కూడా స్వదేశానికి పంపనుంది. వెస్టిండీస్లో పిచ్లు స్పిన్నర్లుకు ఎక్కువగా అనుకూలిస్తాయి. దీంతో సూపర్-8 నుంచి భారత్ ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బుమ్రాతో అర్షదీప్ లేదా సిరాజ్లలో ఒకరు మాత్రమే తుది జట్టులో ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. హార్దిక్ కూడా ఫాస్ట్ బౌలర్గా జట్టుకు ఉపయుక్తంగా ఉన్నాడు. దీంతో ఓ ఫాస్ట్ బౌలర్ గాయపడినా, అవేశ్ ఖాన్తో అవసరం ఉండదని జట్టు యాజమాన్యం భావిస్తోంది. బౌలర్లలో ఖలీల్ అహ్మద్ ఒక్కరిని రిజర్వ్ ప్లేయర్గా ఉంచితే సరిపోతుందని యోచిస్తోంది. ఇక బ్యాకప్ బ్యాటర్గా రింకూ సింగ్ను కొనసాగించనుంది.
టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.