సెమీఫైనల్లో భారత్ చేతిలో తమ జట్టు ఓటమిపాలవ్వడాన్ని ఇంగ్లండ్ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. సెమీస్ జరిగిన వేదిక టీమిండియాకు అనుకూలంగా ఉందని, అందుకే తమ జట్టుపై పైచేయి సాధించిందని అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇరు జట్లు ఒకే వేదికపై ఆడాయని, కాస్త బుర్రతో ఆలోచించి మాట్లాడాలని ధ్వజమెత్తాడు.
గయానా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (57; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (47; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు.

ఆఖర్లో హార్దిక్ పాండ్య (23; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (17 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. క్రిస్ జోర్డాన్ మూడు (3/37) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (25; 19 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కుల్దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23) చెరో మూడు వికెట్లు, బుమ్రా (2/12) రెండు వికెట్లతో విజృంభించారు.
కాగా, మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు నాజర్ హుస్సేన్, మైకేల్ వాన్ భారత విజయం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఫైనల్కు చేరేలా పిచ్, వేదిక ప్రతీది కలిసొచ్చిందని హుస్సేన్ అన్నాడు. మరోవైపు మైకేల్ వాన్ ఎప్పటిలానే వివాదాస్పద ట్వీట్ చేశాడు. ''సూపర్-8లో సౌతాఫ్రికాపై విజయం సాధించి ఉంటే ట్రిండాడ్ వేదికగా ఇంగ్లండ్ సెమీఫైనల్ ఆడేది. అప్పుడు అఫ్గానిస్థాన్పై తప్పక గెలిచేది. కాబట్టి దాని గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అయితే గయానా వేదిక మాత్రం భారత్కు కలిసొచ్చేలా చక్కని ఎంపిక'' అని వాన్ భారత్పై అక్కసుతో ట్వీట్ చేశాడు.
దీనికి హర్భజన్ ట్విటర్ వేదికగా ఘూటాగా రిప్లే ఇచ్చాడు. ''భారత్కు గయానా మంచి వేదిక అని మీరెలా అనుకుంటున్నారు? ఇరు జట్లు ఒకే వేదికపై ఆడాయి. అంతేగాక ఇంగ్లండ్ టాస్ గెలిచి అదనపు ప్రయోజనం పొందింది. సిల్లీగా మాట్లాడటం మానేయండి. అన్ని విభాగాల్లో ఇంగ్లండ్పై టీమిండియా గొప్ప ప్రదర్శన చేసింది. వాస్తవాన్ని అంగీకరించి, ముందుకు వెళ్లండి. ఈ చెత్త మాటలు మీ దగ్గరే ఉంచుకోండి. నాన్సెన్ కాదు, లాజిక్తో మాట్లాడండి'' అని హర్భజన్ ట్వీట్ చేశాడు.