టీ20 వరల్డ్ కప్-2024లో శ్రీలంక తమ ప్రయాణాన్ని ఘనంగా ముగించింది. సెయింట్ లూసియా వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన పోరులో 83 పరుగుల రికార్డు విజయం సాధించింది. పరుగుల పరంగా పొట్టి ప్రపంచకప్లో లంకకు ఇదే రెండో అత్యుత్తమ విజయం. మొదటిది కెన్యాపై 2007లో 172 పరుగుల తేడాతో గెలవడం.
నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 2024 టీ20 ప్రపంచకప్లో 200+ స్కోరు నమోదవ్వడం ఇదే రెండో సారి. ఇంగ్లండ్పై కూడా ఆస్ట్రేలియా సరిగ్గా 201 పరుగులే చేసింది. కాగా, లంక బ్యాటర్లలో అసలంక (46; 21 బంతుల్లో, 1 ఫోర్, 5సిక్సర్లు), కుశాల్ మెండిస్ (46; 29 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్లు. వాన్ బీక్ రెండు వికెట్లు తీశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లంకకు పేలవారంభం దక్కింది. ఓపెనర్ నిశాంక డకౌటయ్యాడు. కామిందు మెండిస్ (17; 20 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన డిసిల్వా (34; 26 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి కుశాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు దూకుడుగా ఆడారు. కుశాల్, డిసిల్వా ఔటైన తర్వాత బాదే బాధ్యతను అసలంక, మాథ్యూస్ (30 నాటౌట్; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) అందుకున్నారు.
ఆఖర్లో హసరంగ (20; 6 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా విరుచుకుపడంతో లంక చివరి అయిదు ఓవర్లలో 77 పరుగులు సాధించింది. అనంతరం భారీ ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 16.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. మైకేల్ (31; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), స్కాట్ ఎడ్వర్ట్స్ (31; 24 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్లు. నువాన్ తుషారా మూడు, హసరంగ, పతిరనా చెరో రెండు వికెట్లు తీశారు. అయితే ఛేజింగ్లో నెదర్లాండ్స్ శుభారంభం దక్కింది.ఓపెనర్లు 5.3 ఓవర్లలో 45 పరుగులు సాధించారు. కానీ ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయి డచ్ ఓటమిపాలైంది.