టీ20 వరల్డ్ కప్లో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుస విజయాలతో హోరెత్తిస్తూ ఫైనల్కు దూసుకెళ్లింది. గయానా వేదికగా గురువారం ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (57; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (47; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు.
ఆఖర్లో హార్దిక్ పాండ్య (23; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (17 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. క్రిస్ జోర్డాన్ మూడు (3/37) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (25; 19 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కుల్దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23) చెరో మూడు వికెట్లు, బుమ్రా (2/12) రెండు వికెట్లతో విజృంభించారు.

అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి (9; 9 బంతుల్లో, 1 సిక్సర్), రిషభ్ పంత్ (4; 6 బంతుల్లో), శివమ్ దూబె (గోల్డెన్ డకౌట్) నిరాశపరిచారు. ఈ ప్రపంచకప్లో ఓపెనర్గా వస్తూ పేలవఫామ్ కొనసాగిస్తున్న కోహ్లి మరోసారి తక్కువస్కోరుకే వెనుదిరిగాడు. దీంతో కోహ్లిని తిరిగి వన్డౌన్లో బ్యాటింగ్ చేయామని నెట్టింట్లో పోస్టులు వస్తున్నాయి. కాగా, ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ను చేజార్చుకున్న దూబెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
జట్టులో దూబె పాత్రపై స్పష్టత ఇవ్వాలని నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. బ్యాటర్గా విఫలమవుతున్న దూబె, బౌలింగ్ కూడా చేయట్లేదని, జట్టులో అసలు ఎందుకు ఉన్నాడో చెప్పాలని మీమ్స్తో విమర్శిస్తున్నారు. ఆల్రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చిన దూబెకు కెప్టెన్ రోహిత్ శర్మ అమెరికాతో జరిగిన మ్యాచ్ మినహా ఇప్పటివరకు బంతిని ఇవ్వలేదు. ఆ మ్యాచ్లో ఒక ఓవర్ వేసిన దూబె 11 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక బ్యాటింగ్ పరంగా.. దూబె నామమాత్రపు ప్రదర్శన చేస్తున్నాడు. పాకిస్థాన్పై మూడు, యూఎస్ఏపై 31, అఫ్గానిస్థాన్పై 10, బంగ్లాదేశ్పై 34, ఆస్ట్రేలియాపై 28 పరుగులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో దూబెను జట్టులో నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మీమ్స్లో వైరల్ అయిన ఫన్నీ కామెంట్లతో దూబెను విమర్శిస్తున్నారు.