పెర్త్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియా యువ సంచలనం షెఫాలీ వర్మకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని సీనియర్ పేసర్ శిఖ పాండే అన్నారు. టీమ్ మేనేజ్మెంట్ ఆమె ఆటలో ఎలాంటి మార్పులు కోరలేదు అని తెలిపారు. సోమవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో షెఫాలీ (39; 17 బంతుల్లో 2x4, 4x6) మరోసారి దూకుడుగా బ్యాటింగ్ చేసింది. దీంతో భారత్ పవర్ ప్లే ముగిసే లోపే 50కి పైగా పరుగులు చేసింది.
తొలి బంతి వేయడానికి ముందు ఎవరూ రాలేదు.. ధోనీ మాత్రం వచ్చి: బుమ్రా
మ్యాచ్ అనంతరం శిఖ పాండే మీడియాతో మాట్లాడుతూ... '16 ఏళ్ల షఫాలీ వర్మ నిజంగా ఓ అద్భుతం. బాగా ఆడుతోంది. ఆ వయసులో నేను క్రికెట్లో పూర్థిస్థాయి శిక్షణ కూడా తీసుకోలేదు. కానీ.. షఫాలీ ఏకంగా టీమిండియా తరుపున ప్రపంచకప్లో ఆడుతోంది. మా జట్టులో యంగ్ అండ్ ఫియర్లెస్ క్రికెటర్ షఫాలీనే. తన ఆటతీరులో మార్పులు చేసుకోవాలని షెఫాలీని మేం అడగలేదు. భయం లేకుండా తను ఆడేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. ఈ విషయంలో షఫాలీకి టీమ్ మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో లైసెన్స్ ఇచ్చింది' అని అన్నారు.
షఫాలీ లాంటి భయం లేని యువ క్రికెటర్లు జట్టులో ఉండడం సంతోషంగా ఉంది. జట్టు కోసం వాళ్లు ఏం చేశారనేది చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. యంగ్ క్రికెటర్ రోడ్రిగ్స్ ఎంతో అనుభవం కలిగిన బ్యాటర్గా రాణాస్తోంది. కష్టకాలంలో ఆమె పోరాటం అద్వితీయం. బాగా ఆడుతోంది. బంగ్లాదేశ్పై చేసిన 142 పరుగులు లక్ష్యాన్ని కాపాడుకోడానికి మంచి స్కోరే అనుకున్నాం. మా బౌలర్లపై నమ్మకముంది' అని శిఖ పాండే పేర్కొన్నారు.
జ్వరంతో బంగ్లాదేశ్ మ్యాచ్కు దూరమైన టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన గురువారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉండనుంది. అనారోగ్యం కారణంగా మంధాన బంగ్లాతో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగలేదు. ఆమె స్థానంలో ఓపెనింగ్ చేసిన తానియా భాటియా (2) అంతగా ఆకట్టుకోలేదు. అయితే షఫాలీ చెలరేగడంతో భారత్ కోలుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా విఫలమయిన విషయం తెలిసిందే.
తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన హర్మన్ సేన.. రెండో మ్యాచ్లో పటిష్ట బంగ్లాదేశ్ను బొల్తా కొట్టిచ్చింది. ఈ రెండు మ్యాచ్ల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిసిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా భారత ఓపెనర్ షఫాలీ, స్పిన్నర్ పూనమ్లపై.