
కేప్టెన్కు ఘన వీడ్కోలు కోసం
ఈ టోర్నమెంట్ తరువాత.. విరాట్ కోహ్లీ కేప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడు. ఇకపై టీ20 ఫార్మట్కు రోహిత్ శర్మ నాయకత్వాన్ని వహిస్తాడు. కేప్టెన్సీ బదలాయింపు నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటివారంలో ఉండొచ్చు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ తరువాత టీమిండియా ఆడబోయే మొట్టమొదటి టీ20 మ్యాచ్- రోహిత్ శర్మ కేప్టెన్సీలోనే ఉంటుంది. విరాట్ కోహ్లీ తప్పుకోబోతోండటంతో ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

టీ20 ప్రపంచకప్లో చోటు దక్కిన తరువాతే..
ఇందులో విజయకేతనాన్ని ఎగురవేయాలనే ఏకైక లక్ష్యంతో జట్టును ఎంపిక చేశారు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్టర్లు. రోజులు గడుస్తున్న కొద్దీ- వారి అంచనాలన్నీ తలకిందులు అవుతున్నాయి. ఘోరంగా తప్పుతున్నాయి. టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్న కొందరు యంగ్ క్రికెటర్లు తమ శక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా ఆడట్లేదు. ఐపీఎల్ టోర్నమెంట్ దీన్ని రుజువు చేసింది. తమకు స్టార్ క్రికెటర్ల హోదాను ఇచ్చి, జాతీయ జట్టు సెలెక్టర్ల దృష్టిలో పడేలా చేసిన ఐపీఎల్ మ్యాచ్లల్లో దారుణంగా విఫలమౌతున్నారు.

ఫామ్లో లేని ఆల్రౌండర్..
వారిలో ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ నిరాశ పరిచారు. అంచాలను తలకిందులు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై వేటు పడుతుందనే వార్తలు ఇదివరకే వెలువడ్డాయి. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ తీరు బీసీసీఐ సెలెక్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఐపీఎల్ 2021 సీజన్లో ఇప్పటిదాకా హార్దిక్ పాండ్యా 11 మ్యాచ్లను ఆడాడు. 117 పరుగులు మాత్రమే చేశాడు. అతని వ్యక్తిగత అత్యుత్తమ స్కోర్ 40 నాటౌట్. బ్యాటింగ్ యావరేజ్ 14.62 శాతమే.

హార్దిక్పై వేటు తప్పదా?
అతను బౌలింగ్కు దిగట్లేదు. 11 మ్యాచుల్లో ఒక్క బంతిని కూడా అతను సంధించలేదు. గత ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ అతను బౌలింగ్ చేయలేదు. శస్త్రచికిత్స అనంతరం అతను బౌలింగ్కు దిగిన సందర్భాలు లేవు. అందుకే అతణ్ని బ్యాట్స్మెన్గా మాత్రమే పరిగణిస్తూ టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఆ బ్యాటింగే ఇప్పుడు అతని కొంప ముంచే ప్రమాదం లేకపోలేదు. 11 మ్యాచుల్లో 117 పరుగులంటే.. టీ20 ప్రపంచకప్ స్థాయి టోర్నమెంట్కు ఏ మాత్రం ఉపయోగపడేవి కావు. అతణ్ని రీప్లేస్ చేయాలనే విషయంపై బీసీసీఐ-సెలెక్షన్ కమిటీ సభ్యులు చర్చించే అవకాశం ఉంది.

ఇషాన్ కిషన్ కోసం..
ఇషాన్ కిషన్ పరిస్థితి కూడా ఇంతే. ముంబై ఇండియన్స్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఇషాన్ కిషన్.. తాను ఆడిన చివరి మ్యాచ్లో సుడిగాలి ఇన్నింగ్ తప్పించితే.. అతని గణాంకాలేవీ పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. రాజస్థాన్ రాయల్స్పై 25 బంతుల్లో 50 పరుగులు చేసి, నాటౌట్గా నిలిచాడు ఇషాన్. ఈ ఒక్క ఇన్నింగ్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. అతని బ్యాటింగ్ మళ్లీ గాడిలో పడినట్టే. అంతకంటే ముందు అతను ఘోరంగా విఫలం అయ్యాడు. తొమ్మిది మ్యాచుల్లో 157 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్పై మ్యాచ్ను మినహాయిస్తే.. ఎనిమిదింట్లో అతను చేసిన పరుగులు 107 మాత్రమే.

రాహుల్ చాహర్ను తప్పించే ఛాన్స్
బౌలింగ్ విషయానికి వస్తే.. రాహుల్ చాహర్పై వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. అతనికి బదులుగా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ యజువేందర్ చాహల్ను తీసుకుంటారని తెలుస్తోంది. నిజానికి- చాహల్ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం ఎంపిక కాలేదు. అతని స్థానంలో రాహుల్ చాహర్ను తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రీప్లేస్ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
యజువేందర్ చాహల్ ఐపీఎల్ 2021లో ఫర్వాలేదనిపించాడు. 13 మ్యాచుల్లో 15 వికెట్లు తీసుకున్నాడు. ఎమిరేట్స్కు ఐపీఎల్ షిఫ్ట్ అయిన తరువాత యజువేందర్ ఆరు మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ చాహర్ నాలుగు మ్యాచుల్లో తీసుకున్నవి రెండు వికెట్లే.


Click it and Unblock the Notifications












