టీ20 వరల్డ్ కప్ను అందుకోవడానికి భారత్ మరో అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. గయానా వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఆల్రౌండ్ షోతో సత్తాచాటి ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించింది. టైటిల్ పోరులో బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ శనివారం తలపడనుంది.
మొదట టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (57; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (47; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు.హార్దిక్ పాండ్య (23; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (17 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. క్రిస్ జోర్డాన్ మూడు (3/37) మూడు వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (25; 19 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కుల్దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23) చెరో మూడు వికెట్లు, బుమ్రా (2/12) రెండు వికెట్లతో విజృంభించారు. అయితే ఇంగ్లండ్పై విజయానంతరం రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. ఫైనల్కు చేరిన వేళ రోహిత్ కళ్లల్లో ఆనందభాష్ఫాలు కనిపించాయి. ఎమోషనల్ అవుతున్న రోహిత్ను డైవర్ట్ చేయడానికి విరాట్ కోహ్లి సరదాగా జోక్లు వేసి నవ్వించడానికి ట్రై చేశాడు.
గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ వన్డే వరల్డ్ కప్ను తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. టోర్నీ ఆద్యంతం సత్తాచాటిన టీమిండియా ఫైనల్లో తడబడింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై కప్ను చేజార్చుకుంది. ఏడు నెలల తర్వాత టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా మరో మెగాటోర్నీలో అడుగుపెట్టిన భారత్ ట్రోఫీకి మరోసారి దగ్గరైంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
ఆనందభాష్ఫాలతో రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా, రోహిత్ కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా జట్టును ముందుండి నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. కఠిన ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్పై భారత్ సాధించిన విజయాల్లో హిట్మ్యాన్ బ్యాటర్గా కీలకపాత్ర పోషించాడు.