టీ20 వరల్డ్ కప్లో భారత్ మహా సమరానికి సిద్ధమైంది. టీ20 ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలవడానికి మరో అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. బార్బడోస్ వేదికగా శనివారం జరగనున్న ఫైనల్లో స్ట్రాంగ్ టీమ్ సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమవుజ్జీలే అయినప్పటికీ భారత్ ఫేవరేట్గా టైటిల్ పోరులో దిగుతోంది.
అయితే ప్రపంచకప్ గెలవాలంటే భారత్కు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఐసీసీ టోర్నీలు గెలవాలంటే లక్ కూడా ముఖ్యమే అని పేర్కొన్నాడు. అయితే ఈ ఫైనల్లో ఓడి కప్ను చేజార్చుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ బాధతో బార్బడోస్ సముద్రంలో దూకేస్తాడని అన్నాడు. గత ఏడు నెలలో సారిథిగా రోహిత్కు ఇది రెండో ప్రపంచకప్ ఫైనల్.

వన్డే వరల్డ్ కప్లో ఆద్యంతం వరుస విజయాలతో సత్తాచాటిన టీమిండియా ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని కోల్పోయింది. అనంతరం ఆ బాధను దిగమింగి కొన్ని నెలలకే భారత్ మరో మెగాటోర్నీలో అడుగుపెట్టి ఫైనల్ వరకు చేరింది. ఈ స్థితిలో దక్షిణాఫ్రికా చేతిలో తుది పోరులో ఓటమిపాలైతే ఆ వేదనతో రోహిత్కు సముద్రంలో దూకేయాలనే ఆలోచన వస్తుందని దాదా అన్నాడు. కానీ భారత్ కప్ను కోల్పోయే ఛాన్సే లేదని, తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
''ఆరు నెలలో రోహిత్ శర్మ రెండు వరల్డ్ కప్ ఫైనల్స్లో ఓడిపోతాడని నేను భావించట్లేదు. కానీ ఒకవేళ జరిగితే అతను బార్బడోస్ సముద్రంలో దూకేస్తాడు. రోహిత్ ముందుండి జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. భారత్ గెలుస్తుందని భావిస్తున్నా. ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడాలి. టీమిండియాకు అదృష్టం కూడా దక్కాలని కోరుకుంటున్నా. మెగాటోర్నీల్లో విజేతగా నిలవాలంటే కాస్త లక్ కూడా ఉండాలి''
''రోహిత్ అయిదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచాడు. ఇది చాలా గొప్ప ఘనత. కొన్నిసార్లు ఐపీఎల్ గెలవడం చాలా కష్టం. అయితే అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్ ఉత్తమమైనదని నేను అనట్లేదు. ఐపీఎల్ గెలవాలంటే సుదీర్ఘంగా విజయాలతో సత్తాచాటాల్సి ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ కూడా అంతే. అదే తరహాలో సౌతాఫ్రికా ఫైనల్లో రోహిత్ సత్తాచాటుతాడని భావిస్తున్నా'' అని గంగూలీ అన్నాడు.