భారత్ లెక్క సరిచేసింది. గత టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓడిన పరాభవానికి ఈసారి బదులు తీర్చుకుంది. గయానా వేదికగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో శనివారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (57; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (47; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు. హార్దిక్ పాండ్య (23; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (17 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. క్రిస్ జోర్డాన్ మూడు (3/37) మూడు వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (25; 19 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కుల్దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23) చెరో మూడు వికెట్లు, బుమ్రా (2/12) రెండు వికెట్లతో విజృంభించారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లిష్ బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. కాగా, మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు.
సమష్టిగా పోరాడామని, ఈ విజయం తనకి ఎంతో సంతృప్తినిచ్చిందని రోహిత్ చెప్పాడు. పరిస్థితులను అర్థం చేసుకోవడమే తమ విజయ రహస్యమని అన్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ గన్ స్పిన్నర్లని, బౌలర్లు గెలుపుతో అద్భుత పాత్ర పోషించారని రోహిత్ చెప్పాడు. ''ఈ విజయం ఎంతో సంతృప్తినిచ్చింది. బృందంగా మేమెంతో శ్రమించాం. ఇక్కడి పరిస్థితులు సవాలుగా ఉంటాయి. కానీ మేం బాగా అర్థం చేసుకున్నాం. అదే మా గెలుపు మంత్రం. మా బ్యాటర్లు, బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లుగా గొప్పగా ఆడటంతో ఘన విజయం సాధించాం. చాలా సంతోషంగా ఉంది''
''ఓ స్థితిలో 140-150 స్కోరు సాధిస్తామేమో అనిపించింది. కానీ సూర్యతో కలిసి నేను మిడిల్ ఓవర్లలో పరుగులు చేశాను. అంతేగాక భాగస్వామ్యాలు నెలకొల్పాం. మరో 25 పరుగులు అదనంగా సాధించాం. ముందే నా మైండ్లో టార్గెట్ గురించి అనుకుంటాను. కానీ ఆ స్కోరును నేను బ్యాటర్లకు ఎవరికీ చెప్పను. ఎందుకంటే వాళ్లు సహజసిద్ధంగా ఆడాలి. స్కోరు గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడాలి. బ్యాటుతో సత్తాచాటి 171 పరుగులు సాధించాం''
''మిగిలిన పనిని బౌలర్లు అద్భుతంగా చూసుకున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ గన్ స్పిన్నర్లు. ఇక్కడి పరిస్థితుల్లో వాళ్లను ఎదుర్కోవడం కష్టమే. అయితే ఒత్తిడి కూడా వాళ్లపై ఉంది. కానీ ప్రశాంతతో ఉంటూ అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ అయిన తర్వాత ఎలా బౌలింగ్ చేయాలో మాట్లాడుకున్నాం. స్టంప్స్కు ఎక్కువగా గురిపెట్టాలని నిర్ణయించుకున్నాం'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.