టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరింది. గయానా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. మొదట భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (57; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (47; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు.
హార్దిక్ పాండ్య (23; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (17 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. క్రిస్ జోర్డాన్ మూడు (3/37) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (25; 19 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కుల్దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23) చెరో మూడు వికెట్లు, బుమ్రా (2/12) రెండు వికెట్లతో విజృంభించారు.

అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (9; 9 బంతుల్లో, 1 సిక్సర్) మరోసారి విఫలమయ్యాడు. గత టీ20 వరల్డ్ కప్లో రికార్డులు సృష్టించిన కోహ్లి ఈ మెగాటోర్నీలో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ప్రపంచకప్లో కోహ్లి సింగిల్ డిజిట్కు పరిమితమవ్వడం ఇది ఏకంగా అయిదోసారి. ఆడిన ఏడు మ్యాచ్ల్లో రెండు సార్లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. 2012 నుంచి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న కోహ్లీ ఇలా మునుపెన్నడూ విఫలమవ్వలేదు. 2012 నుంచి 2022 వరకు అతను రెండు సార్లు మాత్రమే సింగిల్ డిజిట్కు పరిమితమయ్యాడు.
కాగా, విజయానంతరం భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లి ఫామ్ గురించి మాట్లాడాడు. కోహ్లి నాణ్యమైన ప్లేయర్ అని, ప్రతి ఆటగాడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని మద్దతు ఇచ్చాడు. తీవ్రతతో కనిపిస్తున్నాడని, ఫైనల్ కోసం కోహ్లి గొప్ప ప్రదర్శన దాచి పెట్టి ఉండొచ్చని రోహిత్ అన్నాడు. ''విరాట్ కోహ్లి క్వాలిటీ ప్లేయర్. ప్రతీ ఆటగాడు ఈ దశను ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని క్లాస్ ఏంటో, ప్రధాన మ్యాచ్ల్లో అతడు ఎంత కీలమమా మాకు తెలుసు''
''ఫామ్ అనేది సమస్య కాదు. 15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతుంటే ఫామ్ అనేది అసలు సమస్యగా ఉండదు. అయినా కోహ్లి బాగానే ఉన్నాడు. తీవ్రతతోనే ఉన్నాడు. ఫైనల్ కోసం అతడు ఆటను దాచిపెట్టాడనుకుంటా. తుదిపోరులో కోహ్లి తప్పక ఉంటాడు. జట్టుగా మేం ప్రశాంతతో ఉండాలి. ఫైనల్ అనేది మాకు ఎంతో కీలకం. 40 ఓవర్ల పాటు ప్రశాంతతో ఉంటేనే మంచి నిర్ణయాలు తీసుకోగలం. అదే మ్యాచ్లో మంచి ముగింపును సాధించేలా చేస్తుంది'' అని రోహిత్ శర్మ అన్నాడు.