మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన బృందాన్ని మంగళవారం వెల్లడించింది. రింకూ సింగ్, కేఎల్ రాహుల్కు మొండిచేయి చూపడం మినహా అంచనాలకు తగ్గట్లుగానే జట్టును సెలక్ట్ చేశారు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్ పంత్ మెగాటోర్నీతో అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
అయితే టీమిండియా ఎంపికక గురించి మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్ తరఫున టీ20ల్లో సత్తాచాటిన రింకూ సింగ్కు టీ20 ప్రపంచకప్ అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. లోయర్ ఆర్డర్లో మ్యాచ్లను ఫినిష్ చేయగలిగే సత్తా ఉన్న రింకూ కరేబియన్ దీవుల్లో కీలక పాత్ర పోషించగలడని పేర్కొంటున్నారు.

కాగా, రింకూ ప్రపంచకప్ జట్టులో ఎంపిక కాకపోవడానికి గల కారణాలను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వివరించాడు. ఐపీఎల్లో ఫామ్ లేకపోవడమే రింకూపై వేటుకు కారణమని అన్నాడు. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్ను జట్టులోకి తీసుకోవాల్సిందని చెప్పాడు. ''ఐపీఎల్లో రింకూ ఫామ్ అంత గొప్పగా లేకపోవడంతో అతన్ని సెలక్ట్ చేయలేదేమో. రింకూ అంతగా అవకాశాలు రాలేదు. ఈ కారణాలతో సెలక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదనుకుంటా''
''ఎడమచేతి వాటం పేసర్ నటరాజన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు జట్టులో ఉండాల్సింది. అయితే ఎంపిక చేసిన టీమిండియా బాగుంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో అనుభవం, మంచి బిగ్ హిట్టర్లు, వైవిధ్యమైన బౌలింగ్తో జట్టుకూర్పు ఉంది. హార్దిక్ పాండ్యను నాలుగో సీమర్గా భావించి జట్టులో కుల్దీప్, చాహల్, అక్షర్, జడేజా నలుగురు స్పిన్నర్లను సెలక్ట్ చేసి ఉంటారు''
''వెస్టిండీస్లోని పిచ్లు క్విక్ బౌలర్ల కంటే స్పిన్నర్లకు కాస్త ఎక్కువగా అనుకూలిస్తాయి. అంతేగాక ఐపీఎల్లో మనం చూస్తున్నాం. స్లోయర్ డెలివరీలో బ్యాటర్లు భారీ హిట్టింగ్ చేయడానికి కష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అదనపు స్పిన్నర్ను తీసుకుని ఉంటారు'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.