దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్గానిస్థాన్ సెమీఫైనల్ను నిర్వహించిన పిచ్పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ తీవ్ర విమర్శలు చేశాడు. కీలక మ్యాచ్లో ఎలా స్పందిస్తుందో తెలియని కొత్త వికెట్ను ఉపయోగించడం వింతగా ఉందని అన్నాడు. మ్యాచ్లో అస్థిర బౌన్స్ లభించిందని పేర్కొన్నాడు. ట్రిండాడ్ వేదికగా గురువారం అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. వరల్డ్ కప్ చరిత్రలో ప్రొటీస్కు ఇదే తొలి టైటిల్ పోరు.
మండకొడి పిచ్పై మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. వరల్డ్ కప్ సెమీఫైనల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా అఫ్గానిస్థాన్ కోరుకోని రికార్డు సాధించింది.
సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జేన్సన్ (3/16), షంసీ (3/6) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. రబాడ (2/14), నోకియా (2/7) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఆదిలోనే డికాక్ (5; 8 బంతుల్లో, 1 ఫోర్) ఔటైనా రీజా హెండ్రిక్స్ (29 నాటౌట్; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), మార్క్రమ్ (23 నాటౌట్; 21 బంతుల్లో, 4 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ కూడా పిచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్కు ఎంతో సవాలుగా ఉందని తెలిపాడు.
కాగా, కొత్త పిచ్ కాకుండా గతంలో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగిన పాత్ పిచ్పై మ్యాచ్ నిర్వహిస్తే బాగుండేదని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ''ఎలా స్పందిస్తుందో తెలియని కొత్త వికెట్ను సెమీఫైనల్లో ఉపయోగించడం వింతగా ఉంది. పది రోజుల్లో ఈ వికెట్ను సిద్ధం చేశారని విన్నాను. ఈ ప్రపంచకప్లో ఈ వేదికపై వెస్టిండీస్-న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. వాళ్లు ఆడిన వికెట్ 140-150 పరుగులు చేస్తుందనే అవగాహన ఉంది. బంతి స్వింగ్ అవుతుందని తెలుసు. దాన్ని ఎదుర్కోగలం. కానీ బౌన్స్లో అనూహ్య మార్పులు రావడమేంటి? నేనే గ్రౌండ్ సిబ్బంది అయితే, కీలక పోరులో ఇలా చేయను'' అని పాంటింగ్ అన్నాడు.