భారత జట్టులో మరో స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ బాట పట్టాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రకటించాడు. గత 24 గంటల వ్యవధిలో టీ20లకు గుడ్బై పలికిన మూడో భారత ప్లేయర్ జడేజా! టీ20 వరల్డ్ కప్ను గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
టీ20 ఫార్మాట్కు గుడ్బై అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా 35 ఏళ్ల రవీంద్ర జడేజా ఆదివారం ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచి తన కలను నెరవేర్చుకున్నాని భావోద్వేగంతో జడ్డూ పోస్ట్ పెట్టాడు. ''కృతజ్ఞతతో నిండిన హృదయంతో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నాను. పొగరుతూ దూసుకెళ్లే గుర్రంలా నేనెప్పుడూ దేశం కోసం నా అత్యుత్తమ ఆటనే అందించాను''

''అదే జోరును ఇతర ఫార్మాట్లలో కొనసాగిస్తాను. టీ20 వరల్డ్ కప్ను అందుకోవాలనుకున్న నా కల నెరవేరింది. ఇది నా టీ20 కెరీర్లో అత్యున్నత దశ. ఎన్నో జ్ఞాపకాలు అందించినందుకు, మద్దతు కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు'' అని జడేజా పేర్కొన్నాడు. ఈ టీ20 వరల్డ్ కప్లో జడేజా అన్ని మ్యాచ్లు ఆడాడు. తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేనప్పటికీ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మెరుపు ఫీల్డింగ్తో, బ్యాటుతో భారత్ ఛాంపియన్గా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు.
ఇంగ్లండ్తో సెమీఫైనల్లో తొమ్మిది బంతుల్లో అజేయంగా 17 పరుగులు చేశాడు. ఆఖర్లో జడ్డూ చేసిన ఈ పరుగులు విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. అయితే ఈ మెగాటోర్నీలో బంతితో జడేజా ఆకట్టుకోలేకపోయాడు. ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. ఇక భారత్ తరఫున 2009లో అరంగేట్రం చేసిన జడేజా 74 టీ20లు ఆడాడు. 41 ఇన్నింగ్స్ల్లో 21 సగటుతో 515 పరుగులు చేశాడు. అలాగే 54 వికెట్లు పడగొట్టాడు.