టీ20 వరల్డ్ కప్లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్ హ్యాట్రిక్ విజయాలతో హోరెత్తిస్తోంది. ట్రిండాడ్ వేదికగా గురువారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టి 13 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో సూపర్-8కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. షెర్ఫాన్ రూథర్ఫర్డ్ (68 నాటౌట్; 39 బంతుల్లో, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ అర్థశతకంతో చెలరేగాడు.
బౌల్ట్ (3/16) మూడు, సౌథి (2/21), ఫెర్గూసన్ (2/27) చెలరేగడంతో వెస్టిండీస్ మొదట 30 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ నుంచే వికెట్ల వేట మొదలుపెట్టిన కివీస్ బౌలర్లు విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రూథర్ఫర్డ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో స్కోరుబోర్డు ముందుకు నడిపించి పోరాడే లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచాడు.

అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులే చేసింది.గ్లెన్ ఫిలిప్స్ (40; 33 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మిచెల్ శాంట్నర్ (21 నాటౌట్; 12 బంతుల్లో, 3 సిక్సర్లు) ఆఖర్లో దూకుడుగా ఆడాడు. అల్జారీ జోసెఫ్ (4/19), మొటియ్ (3/25) సత్తాచాటారు. అయితే వెస్టిండీస్ ఇన్నింగ్స్లో 12 బంతుల్లో 17 పరుగులు చేసిన నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు.
వెస్టిండీస్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ రికార్డు సాధించాడు. 83 ఇన్నింగ్స్లో పూరన్ 25 సగటు, 134 స్ట్రైక్రేటుతో 1914 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధశతకాలు ఉన్నాయి. అంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 75 ఇన్నింగ్స్లో 27 సగటు, 137 స్ట్రైక్రేటుతో 1899 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. కాగా, లీగ్ స్టేజ్లో వెస్టిండీస్ తమ చివరి మ్యాచ్ను సోమవారం అఫ్గానిస్థాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే వెస్టిండీస్ టేబుల్ టాపర్గా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.