మరో రెండు నెలల్లో టీ20 వరల్డ్ కప్ జరనున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకోనుంది. గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవడానికి పాక్ బోర్డు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జట్టు కూర్పు, కెప్టెన్సీపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి బాబర్ అజామ్కు అందించాలని ప్లాన్ చేస్తోంది. వన్డే వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్ పేలవమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీనికి బాధ్యత వహిస్తూ బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వన్డే ఫార్మాట్తో పాటు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నెలకొల్పిన తీవ్ర ఒత్తిడితో బాబర్ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు.

అయితే బాబర్ అజామ్ స్థానంలో టెస్టుల్లో షాన్ మసూద్, టీ20 ఫార్మాట్లో షాహిన్ అఫ్రిది జట్టు పగ్గాలు అందుకున్నారు. కానీ వాళ్లు సారథిగా దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో ఒక్క విజయం కూడా పాక్ సాధించలేకపోయింది. న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ను 1-4తో ముగించింది.
దీంతో టీ20 ప్రపంచకప్ గురించి పాక్ బోర్డు ప్రణాళికలు మొదలుపెట్టింది. అఫ్రిదిని తప్పించి వరల్డ్ కప్లో సారథి బాధ్యతలు బాబార్ అజామ్కు తిరిగి అందించాలని ప్లాన్ చేస్తోంది. బాబర్ అజామ్తో పాటు మహ్మద్ రిజ్వాన్ను కూడా కెప్టెన్గా పరిశీలిస్తున్నారు. జట్టు పగ్గాలు తిరిగి అందుకోవడానికి బాబర్ ఇష్టపడకపోతే రిజ్వాన్కు అవకాశం ఇవ్వాలని పాక్ బోర్డు భావిస్తోంది.పాకిస్థాన్ సూపర్ లీగ్లో రిజ్వాన్ ముల్తాన్ సుల్తాన్స్ను ఫైనల్కు చేర్చాడు.
మరోవైపు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించడానికి ఇమాద్ వసీమ్, మహ్మద్ అమీర్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు బాబర్ కెప్టెన్సీపై అమీర్ విమర్శలు చేశాడు. దీంతో బాబర్ తిరిగి కెప్టెన్ అయితే అమీర్కు జట్టులో చోటు దక్కకపోవొచ్చని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, టీ20 వరల్డ్ కప్కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుంది. జూన్ 2న ఈ మెగాటోర్నీ ప్రారంభంకానుంది. జూన్ 5న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.