పాకిస్థాన్ జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ తిరిగి జట్టు బాధ్యతలు అందుకున్నాడు. జూన్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ను బాబర్ నడిపించనున్నాడు. టీ20 ఫార్మాట్తో పాటు వన్డే ఫార్మాట్ బాధ్యతలను బాబర్ తీసుకున్నాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని వదులుకున్న విషయం తెలిసిందే.
అయితే మెగాటోర్నీల్లో ఓటమిపాలైన తర్వాత తమ జట్టు కెప్టెన్లను మార్చడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కొత్తేమి కాదు. దీంతో బాబర్ అజామ్ కెప్టెన్సీపై వేటు సాధారణమే అన్నట్లుగా వార్తలు వచ్చాయి. మరోవైపు జట్టు ప్రదర్శన ఆధారంగానే కాకుండా బాబర్ అజామ్ను కావాలనే పాకిస్థాన్ బోర్డు పెద్దలు తప్పించారనే కథనాలు వచ్చాయి.

కానీ ఇటీవల పాకిస్థాన్ బోర్డులో మార్పులు చోటు చేసుకున్నాయి. జకా అష్రఫ్ స్థానంలో మోహ్సిన్ రజా చైర్మన్ బాధ్యతలు అందుకున్నాడు. దీంతో పాక్ బోర్డు కెప్టెన్సీ విషయంలో తన మనసు మార్చుకుంది. మరో రెండు నెలల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో బాబర్కు తిరిగి బాధ్యతలు కట్టబెట్టింది.గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ జట్టు కూర్పు, కెప్టెన్సీపై కీలక నిర్ణయాలు తీసుకుంది.
వన్డే వరల్డ్ కప్ అనంతరం బాబర్ అజామ్ స్థానంలో టెస్టుల్లో షాన్ మసూద్, టీ20 ఫార్మాట్లో షాహిన్ అఫ్రిది కెప్టెన్లుగా పాక్ బోర్డు ప్రకటించింది. వన్డే ఫార్మాట్కు కెప్టెన్ ఎవరనే విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే షాన్ మసూద్, షాహిన్ అఫ్రిది సారథిగా దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో ఒక్క విజయం కూడా పాక్ సాధించలేకపోయింది. న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ను 1-4తో ముగించింది.
దీంతో టీ20 ప్రపంచకప్ గురించి పాక్ బోర్డు ప్రణాళికలు మొదలుపెట్టింది. అఫ్రిదిని తప్పించి వరల్డ్ కప్లో సారథి బాధ్యతలు బాబార్ అజామ్కు తిరిగి అందించింది. కెప్టెన్సీ రేసులో బాబర్ అజామ్తో పాటు మహ్మద్ రిజ్వాన్ను కూడా నిలిచాడు. కానీ అనుభవం ఉన్న బాబర్ అజామ్కే పాక్ బోర్డు పెద్దలు మొగ్గు చూపారు. కాగా, టీ20 వరల్డ్ కప్కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుంది. జూన్ 2న ఈ మెగాటోర్నీ ప్రారంభంకానుంది. జూన్ 5న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.