టీ20 వరల్డ్ కప్లోని ఆఖరి లీగ్ స్టేజ్ మ్యాచ్లో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. సెయింట్ లూసియా వేదికగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో చెలరేగాడు. 53 బంతుల్లో 98 పరుగులు బాదాడు. ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో హోరెత్తించాడు. పూరన్కు తోడుగా ఓపెనర్ చార్లెస్ (43; 27 బంతుల్లో, 8 ఫోర్లు) కూడా సత్తాచాటడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 218 పరుగులు చేసింది.
అయితే ఈ క్రమంలో పూరన్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి 36 పరుగులు రాబట్టుకున్నాడు. నాలుగో ఓవర్ వేసిన అజ్మతుల్లాకు పూరన్ సిక్సర్తో స్వాగతం పలికాడు. రెండో బంతిని ఫోర్ బాదాడు. అయితే అది నోబాల్. ఒత్తిడికి లోనైన అజ్ముతుల్లా ఫ్రీహిట్ను భారీ వైడ్గా వేయడంతో అది బౌండరీకి చేరి అదనంగా అయిదు పరుగులు వచ్చాయి.

ఆ తర్వాత వేసిన ఫ్రీహిట్ బాల్కు పరుగులేమి రానప్పటికీ అనంతరం పూరన్ బౌండరీల వర్షం కురిపించాడు. మూడో బంతి లెగ్బై రూపంలో బౌండరీ లభించింది. నాలుగొ బంతిని పాయింట్ మీదుగా ఫోర్ సాధించాడు. అయిదో బంతిని 89 మీటర్ల సిక్సర్గా మలిచాడు. ఇక ఆఖరి బంతిని కూడా లాంగాఫ్ మీదుగా సిక్సర్ బాదడంతో ఏకంగా 36 పరుగులు వచ్చాయి. దీంతో అరుదైన జాబితాలో పూరన్ చోటు సంపాదించాడు.
ఓ ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా హేమాహేమీల సరసన పూరన్ నిలిచాడు. టీ20ల్లో ఓ ఓవర్లో 36 పరుగులే అత్యధికం. దీన్ని ఇప్పటివరకు కొందరు ఒంటిచేత్తో, మరికొందరు పార్టనర్తో సాధించారు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్ (స్టువర్ట్ బ్రాడ్-2007), కీరన్ పొలార్డ్ (ధనంజయ-2007), రోహిత్ శర్మ & రింకూ సింగ్ (కరీమ్ జనత్-2024), దీపేంద్ర సింగ్ (కమ్రాన్ ఖాన్-2024), పూరన్ & చార్లెస్ (అజ్మతుల్లా ఒమర్జాయ్- 2024) ఉన్నారు.