టీ20 వరల్డ్ కప్లో తమ ప్రయాణాన్ని న్యూజిలాండ్ విజయంతో ముగించింది. ట్రిండాడ్ వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో విజృంభించి ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అఫ్గానిస్థాన్, వెస్టిండీస్తో జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై కివీస్ మొదటి రౌండ్లోనే టోర్నీ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉగాండపై గెలిచి ఆలస్యంగా గెలుపు బాట పట్టిన న్యూజిలాండ్ సోమవారం పసికూన పపువాపై ఓదార్పు విజయాన్ని సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 19.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. చార్లెస్ అమిని (17; 25 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించారు. ఫెర్గూసన్ నాలుగు ఓవర్లు మెయిడిన్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. తన చివరి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లతో (2/14) చెలరేగాడు. సౌథి కూడా తగ్గేదేలా అంటూ రెండు (2/11) వికెట్లు పడగొట్టాడు.

పపువా న్యూ గినియా బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. అయితే కివీస్ ఛేజింగ్ సాఫీగా సాగలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ (డకౌట్) వికెట్ కోల్పోయింది. కొద్దిసేపటికే వన్డౌన్లో వచ్చిన రచిన్ రవీంద్ర (6; 11 బంతుల్లో) పెవిలియన్కు చేరాడు.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కేన్ విలియమ్సన్ (18 నాటౌట్; 17 బంతుల్లో, 2 ఫోర్లు)తో కలిసి ఓపెనర్ డెవాన్ కాన్వే (35; 32 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆఖర్లో కాన్వే ఔటైనప్పటికీ డారిల్ మిచెల్ (19 నాటౌట్; 12 బంతుల్లో, 3 ఫోర్లు) కలిసి విలియమ్సన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫెర్గూసన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.