కింగ్స్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో నేపాల్ అసాధారణ పోరాటం చేసింది. ఓ దశలో విజయం దిశగా దూసుకెళ్లిన నేపాల్ అన్యూహ్యంగా ఒత్తిడికి చిత్తయింది. కానీ ఆఖర్లో గొప్పగా పుంజుకుని తిరిగి సత్తాచాటింది. అయితే అంతిమంగా గెలుపు ముంగిట బోల్తా పడింది. సౌతాఫ్రికా చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవరల్లో ఏడు వికెట్లకు 115 పరుగులు చేసింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (43; 49 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. కుశాల్ (4/19) నాలుగు, దీపేంద్ర సింగ్ (3/21) మూడు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఆసిఫ్ షేక్ (42; 49 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు.

అయితే నేపాల్ విజయానికి ఓ దశలో 38 బంతుల్లో 31 పరుగులే అవసరమయ్యాయి. కానీ షంసీ (4/19) రెండు వికెట్లు సాధించి సౌతాఫ్రికాను పోటీలోకి తెచ్చాడు. ఆ తర్వాత నేపాల్ విజయ సమీకరణం 2 ఓవర్లలో 16 పరుగులుగా మారింది. నోకియా వేసిన 19వ ఓవర్లో మొదటి నాలుగు బంతుల్లో నేపాల్ వికెట్ కోల్పోయి , ఒక్క పరుగు కూడా సాధించలేదు. కానీ అయిదో బంతిని సోంపాల్ (8 నాటౌట్, 4 బంతుల్లో) సిక్సర్గా మలిచి, ఆరో బంతికి రెండు పరుగులు తీశాడు.
దీంతో నేపాల్ గెలుపుకు చివరి ఆరు బంతుల్లో 8 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో బార్ట్మన్ తొలి రెండు బంతులకు పరుగులేమి ఇవ్వలేదు. కానీ గుల్షాన్ వరుసగా ఫోర్, రెండు పరుగులు చేసి నేపాల్ను విజయానికి దగ్గరగా చేర్చాడు. అయితే బార్ట్మన్ అయిదో బంతిని బౌన్సర్గా వేసి డాట్ చేశాడు. దీంతో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతిని కూడా బౌన్సర్ వేయడంతో గుల్షాన్ సత్తాచాటలేకపోయాడు. కానీ బై రూపంలో పరుగు తీయాలనుకున్న నేపాల్కు సౌతాఫ్రికా చెక్ పెట్టింది.
డికాక్ వేసిన త్రో గుల్షాన్ తగిలి బంతి క్లాసెన్ దగ్గరకు వచ్చింది. క్లాసెన్ త్రో వేయడంతో గుల్షాన్ ఇంచు దూరంలో ఔటయ్యాడు. అనంతరం జట్టును గెలిపించలేకపోయాననే బాధతో గుల్షాన్, సోంపాల్ ఎంతో బాధపడ్డారు. మైదానంలో ఉన్న గుల్షాన్తో పాటు డగౌట్లో ఉన్న నేపాల్ ప్లేయర్లు కంటతడి పెట్టాడు. స్టేడియంలో ఉన్న నేపాల్ అభిమానులు కూడా కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. సంచలన విజయానికి అడుగు దూరంలో నిలవడంతో ఎమోషనల్ అయ్యారు.