టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్గా భారత్ నిలిచింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సాధించింది. 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువు, 13 ఏళ్ల ప్రపంచకప్ కల నెరవేరాయి. గత దశాబ్దం నుంచి ఎన్నో వరల్డ్ కప్లు టీమిండియాకు అందినట్లే అంది దూరమయ్యాయి. మొత్తంగా ట్రోఫీ అందుకోవడంతో భారత ఆటగాళ్ల కళ్లలో ఆనందభాప్ఫాలు కనిపించాయి.
అయితే ఇదంతా ఒకవైపు. మరోవైపు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఓటమి బాధతో ఏడ్చేశారు. కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్ల బాధను చూస్తుంటే టీమిండియా అభిమానుల గుండె కూడా తరుక్కుపోతుంది. చరిత్రలో తొలిసారి ప్రపంచకప్ ఫైనల్కు వచ్చిన సౌతాఫ్రికా.. కప్ను అందుకోవాలనే లక్ష్యంతో కసిగా బరిలోకి దిగింది. టాస్ ఓడి మొదట బంతి అందుకున్నప్పటికీ ఆదిలోనే భారత్ కష్టాల్లో నెట్టింది. 34 పరుగులకు కీలక మూడు వికెట్లు పడగొట్టింది.

కానీ అదే జోరు ఆఖరి వరకు కొనసాగించలేకపోయింది. ఛేదనలో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ గొప్పగా పోరాడి మ్యాచ్ను ఓ దశలో వన్సైడ్గా మార్చింది. విజయ సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా చేసింది. చేతిలో ఆరు వికెట్లు, క్రీజులో కుదురుకున్న విధ్వంసకర బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఉన్నారు. వాళ్ల ఊపు చూస్తుంటే మూడు ఓవర్లలోనే మ్యాచ్ ముగిస్తారేమో అనిపించింది.
కానీ భారత్ గొప్ప పోరాటానికి తోడుగా దక్షిణాఫ్రికాకు దురదృష్టం వెంటాడంతో సఫారీ సేన ఏడు పరుగులలో ఓటమి చవిచూసింది. అప్పటివరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడిన సౌతాఫ్రికా ప్లేయర్లు ఒక్కసారిగా తడబడ్డారు. ఒత్తిడికి చిత్తయ్యారు. గతంలో ఇలా గెలిచే మ్యాచ్ల్లోనూ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. కానీ ఈ ప్రపంచకప్లో తాము చోకర్స్ కాదనేలా నిలకడగా ప్రదర్శన చేశారు. అయినప్పటికీ ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు. దీంతో ఆటగాళ్లు కన్నీరుమున్నీరయ్యారు.

2023 వన్డే వరల్డ్ కప్లో కూడా సౌతాఫ్రికా గొప్ప ప్రదర్శన చేసింది. భారీ స్కోర్లతో ప్రత్యర్థులపై విరుచుపడింది. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో ఒత్తిడికి గురై ఫైనల్కు చేరలేకపోయింది. గత పరాభవం నుంచి పాఠాలు నేర్చుకుని 2024 టీ20 వరల్డ్ కప్లో అడుగుపెట్టింది. లీగ్, సూపర్-8 దశల్లో ఓడే మ్యాచ్లను అద్భుత పోరాటంతో గెలిచింది. కానీ కీలక పోరులో మాత్రం ఎప్పటిలానే తడబడింది.