
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి విండీస్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ సంచలన విజయం అందుకుంది. 56 పరుగుల తేడాతో అఫ్గాన్ ఘన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్ కెప్టెన్ మొహ్మద్ నబీ.. విండీస్ను ఓ ఆటాడుకున్నాడు. తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం రెండు పరుగులే ఇచ్చి.. మూడు వికెట్లు పడగొట్టాడు. నబీ రెండు మెయిడిన్ ఓవర్లు కూడా వేయడం ఇక్కడ విశేషం. రోస్టన్ ఛేజ్ (54), నికోలస్ పూరన్ (35) మాత్రమే క్రీజులో నిలబడ్డారు. కరీం జనత్, నవీన్-ఉల్-హక్ తలో వికెట్ పడగొట్టారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడు ఓవర్లలో 14 ఇచ్చాడు.
ఈ వార్మప్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్(35 బంతుల్లో 56; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ షెహజాద్(35 బంతుల్లో 54; 6 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతో పరుగులు చేశారు. దాంతో అఫ్గాన్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధ శతకాలు చేశారు. రహ్మానుల్లా గర్భాజ్ (26 బంతుల్లో 33), నజీబుల్లా జద్రాన్ (19 బంతుల్లో 23) కూడా చెలరేగడంతో అఫ్గాన్ భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ ఆఖరలో విండీస్ కట్టుదిట్టంగా బౌల్ చేసింది లేదంటే స్కోర్ 200 దాటేదే. చివరి ఓవర్లో ఆండ్రీ రసెల్ అఫ్గాన్ జట్టును కట్టడిచేశాడు. విండీస్ బౌలర్లలో మెక్కాయ్ 2 వికెట్లు పడగొట్టగా.. రామ్పాల్, హేడెన్ వాల్ష్, రసెల్ తలో వికెట్ తీశారు.
190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ ఆరంభంలోనే తడబడింది. మొహ్మద్ నబీ దెబ్బకు తొలి 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి విండీస్ కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగింది. లెండిల్ సిమన్స్ (0), ఎవిన్ లూయిస్ (3)లను నబీ పెవిలియన్కు పంపాడు. ఏడో ఓవర్లో కూడా శిమ్రాన్ హెట్మైర్ (2)ను నబీ వెనక్కిపంపాడు. నబీ కట్టుదిట్టమైన బంతులు వేయడంతో విండీస్ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. నబీ బంతులను ఎదుర్కునే ప్రయత్నమే చయయలేదు విండీస్ బ్యాటర్లు. ఈ సమయంలో రోస్టన్ ఛేజ్, నికోలస్ పూరన్ జట్టును ఆదుకున్నారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం పూరన్ ఔట్ అయ్యాడు. ఆపై ఛేజ్చివరివరకు క్రీజులో ఉన్నా.. ఫలితం లేకుండా పోయింది.