టీ20 వరల్డ్ కప్లో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఫ్లోరిడాలోని లాడర్హిల్ స్టేడియంలో కెనడాతో శనివారం తలపడనుంది. ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించిన టీమిండియా లీగ్ స్టేజ్ను అజేయంగా ముగించాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకు భారత్ ఓటమి రుచి చూడనప్పటికీ బ్యాటర్లు నిరాశపరిచిన విషయం తెలిసిందే. మందకొడి పిచ్పై మన స్టార్ ప్లేయర్లు ఆకట్టుకోలేకపోయారు.ఈ నేపథ్యంలో కెనడాతో జరిగే మ్యాచ్తో పూర్తి సామర్థ్యం చూపించాలని టీమిండియా భావిస్తోంది.
మరోవైపు కెనడా అద్భుత ప్రదర్శన చేసి సూపర్-8కు అవకాశాలు మెరుగుపర్చుకోవాలని యోచిస్తోంది. మూడు మ్యాచ్లు ఆడిన కెనడా ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలతో నాలుగో స్థానంలో ఉంది. రెండు పాయింట్లు, -0.493 రన్రేటుతో సూపర్-8 ఆశలు సజీవంగానే ఉంచుకుంది. భారత్పై నెగ్గి, అదృష్టం కూడా కలిసి వస్తే కెనడా తదుపరి దశకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే యూఎస్ఏ, పాకిస్థాన్ నాలుగు పాయింట్లు మించకుండా, కెనడాకే మెరుగైన రన్రేటు ఉండాలి.

కాగా, సూపర్-8ను దృష్టిలో పెట్టుకొని కెనడాతో తుదిజట్టును ఖరారు చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అవసరమైతే బౌలర్లపై పనిభారాన్ని తగ్గించాలని ఆలోచిస్తోంది. నెల రోజుల పాటే మెగాటోర్నీ సాగనుంది. కానీ ఐపీఎల్ కారణంగా మన ఆటగాళ్లు గత రెండు నెలల నుంచి అవిరామంగా క్రికెట్ ఆడుతున్నారు. కాబట్టి ప్రధాన ఆటగాళ్లకు కెనడా మ్యాచ్లో విశ్రాంతి ఇవ్వాలని యాజమాన్యం యోచిస్తోంది.
స్టార్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ను తుదిజట్టులో తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుత మెగాటోర్నీలో కుల్దీప్ ఇంతవరకు అరంగేట్రం చేయని విషయం తెలిసిందే. పైగా లాడర్హిల్ స్టేడియంలో బ్యాటింగ్కు అనుకూలిస్తోంది. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జడేజా స్థానంలో కుల్దీప్ను తీసుకురావాలని ఆలోచిస్తోంది. అంతేగాక రిషభ్ పంత్కు విశ్రాంతి ఇవ్వాలని యోచిస్తోంది. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని ఐపీఎల్ అనంతరం తిరిగి జట్టులోకి వచ్చిన పంత్కు రెస్ట్ అవసరమని, అతని స్థానంలో సంజు శాంసన్ను తీసుకోవాలని అనుకుంటుంది.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సంజు శాంసన్/రిషభ్ పంత్ , సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్