టీ20 వరల్డ్ కప్-2024 హోరాహోరీగా సాగుతోంది. అంచనాలు తలకిందులవుతున్నా క్రికెట్ అభిమానులను మెగాటోర్నీ ఉర్రూతలూగిస్తోంది. అమెరికా-కెనడా మ్యాచ్తో ఆరంభం అదిరింది. తొలి మ్యాచ్లోనే రికార్డులు బద్దలయ్యాయి. ఇక వెస్టిండీస్ను పపువా న్యూ గినియా భయపెట్టింది. నమీబియా-ఒమన్ మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్కు దారితీసింది. శ్రీలంక-దక్షిణాఫ్రికా పోరు టెస్టును తలపించింది.
అయితే క్రికెట్ ఫ్యాన్స్కు అసలు మజా దక్కాలంటే అగ్రశ్రేణి జట్ల మ్యాచ్లు ప్రారంభమవ్వాల్సిందే. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్లో మొదలైతే ప్రపంచకప్ సందడి షురూ అవుతుంది. కాగా, ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో ఫైనల్ కంటే భారత్-పాకిస్థాన్ ఆడే లీగ్ మ్యాచ్కే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మినీ యుద్ధాన్ని తలపించే ఇండియా-పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూస్తుంటుంది.

గ్రూప్-ఏలో భాగంగా న్యూయార్క్ వేదికగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో గత భారత్-పాక్ మ్యాచ్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా గత టీ20 వరల్డ్ కప్లో మెల్బోర్న్ వేదికగా తలపడిన ఇండియా-పాక్ మ్యాచ్ను అభిమానులు గుర్తుచేస్తుకుంటున్నారు. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా ఈ మ్యాచ్ సాగింది. బంతి బంతికి ఉత్కంఠ, ఊపిరి బిగపట్టి అభిమానులు వీక్షించేలా హోరాహోరీగా ఆఖరి బంతి వరకు మ్యాచ్ సాగింది.
ఈ మ్యాచ్లో కోహ్లి ఇన్నింగ్స్ను వర్ణించడానికి మాటలు సరిపోవు. కోహ్లి అద్భుత పోరాటం కారణంగా ఎప్పుడూ ప్రశాంతతో ఉండే రాహుల్ ద్రవిడ్యే ఆవేశంగా గెలుపు సంబరాలు చేసుకున్నాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చిన్నపిల్లాడిలా కేరింతలు కొడుతూ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. భారత్-పాక్ మ్యాచ్ జరిగిన తీరు ఏ విధంగా సాగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 159 పరుగులు చేసింది. మసూద్ (52; 42 బంతుల్లో, 5 ఫోర్లు), ఇఫ్తికర్ మహ్మద్ (51; 34 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య మూడు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో భారత్ 31 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది. కానీ హార్దిక్ పాండ్య (40; 37 బంతుల్లో; 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి విరాట్ కోహ్లి (82*; 53 బంతుల్లో, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. కోహ్లి ఆఖరి వరకు నిలబడి ఇండియాను గెలిపించాడు.