టీ20 వరల్డ్ కప్-2024ను ఘనంగా ప్రారంభించాలనుకున్న న్యూజిలాండ్కు బిగ్ షాక్ తగిలింది. అఫ్గానిస్థాన్ చేతిలో 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. గయానా వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో విఫలమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టీ20 ప్రపంచకప్లో పరుగుల పరంగా న్యూజిలాండ్కు ఇదే అతి పెద్ద ఓటమి.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 159 పరుగులు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్ (80; 56 బంతుల్లో, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభిచాడు. ఇబ్రహీం జద్రాన్ (44; 41 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అజ్మతుల్లా (22; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ (2/22), మ్యాట్ హెన్రీ (2/37) చెరో రెండు వికెట్లు, ఫెర్గూసన్ (1/28) ఓ వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 15.2 ఓవర్లలోనే 75 పరుగులకు కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (18; 18 బంతుల్లో, 2 ఫోర్లు), హెన్రీ (12; 17 బంతుల్లో) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. ఫజాల్లా ఫరూకీ (4/17), రషీద్ ఖాన్ (4/17) చెరో నాలుగు వికెట్లతో విజృంభించారు. మహ్మద్ నబీ (2/16) రెండు వికెట్లు తీశాడు. కాగా, మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వివరించాడు. అన్ని విభాగాల్లో తమ జట్టుపై అఫ్గానిస్థాన్ పైచేయి సాధించిందని అన్నాడు.
మొదటి పది ఓవర్లలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని, తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయామని తెలిపాడు. వెస్టిండీస్తో జరిగే తర్వాతి మ్యాచ్ బలంగా పుంజుకుంటామని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ''అఫ్గానిస్థాన్కు కంగ్రాట్స్. అన్ని విభాగాల్లో అఫ్గాన్ అదరగొట్టింది. కఠిన పిచ్పై వాళ్లు గొప్ప స్కోరు సాధించారు. చేతిలో వికెట్లు ఉంచుకుని బాగా ఆడారు. అయితే మేం ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాం''
''ఈ మ్యాచ్ కోసం మా ఆటగాళ్ల తీవ్రంగా సాధన చేశారు. కానీ ఉత్తమ ప్రదర్శన చేయలేకపోయాం. దీని గురించి సమీక్షించి తిరిగి సత్తాచాటుతాం. ఛేదనలో కీలక భాగస్వామ్యాలు నమోదు చేయాలి. కానీ అది జరగలేదు. వాళ్లు చక్కగా ఆడారు. ఎంతో నైపుణ్యం ఉన్న అఫ్గాన్ స్పిన్నర్లతో ఇబ్బంది పడ్డాం. ఇక మా ఫీల్డింగ్ నిరాశపరిచింది. తొలి పది ఓవర్లలో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం'' అని విలియమ్సన్ పేర్కొన్నాడు. కాగా, భారత కాలమాన ప్రకారం జూన్ 13న ఉదయం 6 గంటలకు వెస్టిండీస్తో కివీస్ తలపడనుంది.