
ఇస్లామాబాద్: యూఏఈ, ఒమన్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో (అక్టోబర్ 17) ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతుండగా.. అక్టోబర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 23న అసలు సమరం.. సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. ఇక అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. దాంతో ఈ మ్యాచ్పై అందరిలోనూ ఆసక్తి పతాక స్థాయికి చేరుకుంది. భారత్-పాక్ మ్యాచుపై మాజీలు, ప్లేయర్స్ అందరూ తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కూడా స్పందిస్తూ.. తమ జట్టుకు సలహాలు, సూచనలు ఇచ్చాడు.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాది జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం టీమిండియా.. పాక్కు వెళ్లింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. 2018 ఆసియా కప్, 2019 వన్డే ప్రపంచకప్ పోరులో పాక్ ఓడిపోయింది. ఇక టీ20 ప్రపంచకప్లో పాక్తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్ నాలుగు గెలుపొందింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
తాజాగా జియో టివికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ భారత్, పాకిస్తాన్ మ్యాచుపై స్పందించాడు. 'టీ20 ప్రపంచకప్లో ఆదిలోనే పాకిస్థాన్ జోరందుకోవడానికి టీమిండియాతో మ్యాచ్ కీలకం కానుంది. భారత్ బలమైన జట్టు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. కానీ పాకిస్థాన్ ఎలాంటి బెరుకు లేకుండా ఆడితేనే భారత్ని ఓడించగలదు. ముఖ్యంగా మైదానంలో పాక్ ప్లేయర్స్ ఒత్తిడికి గురికాకూడదు. ఇక జట్టులోని ఆటగాళ్లందరూ తమ వంతు పాత్ర పోషించాలి. టీ20 కాబట్టి చిన్న క్యాచ్ కూడా నేలపాలుచేయకూడదు. మొదటి నుంచే హిట్టింగ్ చేయొద్దు. సరైన సమయం కోసం వేచి చూడాలి. పక్కాగా ప్రణాళికలతో మైదానంలోకి దిగి.. వాటిని అమలు చేయాలి' అని మియాందాద్ పేర్కొన్నాడు.
క్రికెట్ పాకిస్తాన్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడుతూ... 'ఇప్పుడు మా ద్యేయం ఒక్కటే. అదే టీమిండియాను ఓడించడం. ప్రస్తుతం మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భారత్ను ఓడిస్తే.. మరింత బలోపేతమవుతాం. ప్రపంచకప్లో మొహ్మద్ రిజ్వాన్తో కలిసి ఓపెనింగ్ చేస్తా. పరిస్థితులకు అనుగుణంగా జట్టులో మార్పులు చేసుకుంటాము. మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్లు మ్యాచ్ విన్నర్లు. వారి సలహాలు మైదానంలో ఉపయోగపడుతాయి.
అలాంటి సీనియర్లు జట్టులో ఉండటం కలిసొచ్చే అంశం. ప్రతి మ్యాచ్లో ఉండే ఒత్తిడి, తీవ్రత గురించి మాకు తెలుసు. ముఖ్యంగా తొలి మ్యాచ్.. అది కూడా టీమిండియాతో అయితే ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి తొలి మ్యాచ్లోనే గెలిచి అదే దూకుడును కొనసాగిస్తామన్న నమ్మకం ఉంది. గత మూడు, నాలుగేళ్లుగా యూఏఈలో మ్యాచ్లు ఆడుతున్నాం. అక్కడి కండిషన్స్ మాకు బాగా తెలుసు. పిచ్ ఎలా మారుతుంది, అందుకు తగినట్లుగా ఎలా మార్పులు చేసుకోవాలో తెలుసు. అయితే మ్యాచులో ఎవరు బాగా ఆడతారో వాళ్లే గెలుస్తారు' అని బాబర్ అన్నాడు.