మెగా టోర్నీల్లో పాకిస్థాన్పై భారత్కు మెరుగైన రికార్డు ఉందని, అదే జోరు టీ20 ప్రపంచకప్లోనూ రోహిత్ సేన కొనసాగిస్తుందని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అన్నాడు. రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మహా సమరానికి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుంది. తొలి దశలో ఇరవై దేశాలు నాలుగు గ్రూప్లుగా విడిపోయి తలపడనున్నాయి.
గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా ఉన్నాయి. పసికూనలపై రోహిత్ సేన సులవుగా గెలిచి తదుపరి దశకు చేరుకోవడం దాదాపు ఖాయమే. కానీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. న్యూయార్క్ వేదికగా జూన్ 9న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే వన్డే వరల్డ్ కప్లో ఆది నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్పై భారత్దే పైచేయి. ప్రతి మ్యాచ్లోనూ విజయఢంకా మోగించింది మనమే.

టీ20 వరల్డ్ కప్ల్లోనూ ఓ మ్యాచ్ మినహా మిగిలిన్నింట్లో ఇండియానే గెలిచింది. 2021 టీ20 వరల్డ్ కప్లో గెలుపే పాకిస్థాన్కు నిలిచిన ఏకైక ఊరట. ఇక గత 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్లో భారత్దే ఘన విజయం. కాగా, ఈ సారి పాకిస్థాన్పై టీమిండియానే గెలుస్తుందని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. అయితే భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడాలని సూచించాడు. 2022 టీ20 కప్లో టీమిండియా ప్లేయర్లు ఒత్తిడితో ఆడారని పేర్కొన్నాడు.
''సుదీర్ఘ కాలంగా పాకిస్థాన్పై మనకు మెరుగైన రికార్డు ఉంది. గత వన్డే వరల్డ్ కప్లో భారత్కు వచ్చిన పాకిస్థాన్ను అహ్మదాబాద్లో సునాయాసంగా గెలిచాం. అయితే వన్డే ఫార్మాట్ కంటే టీ20 ఫార్మాట్లో పాకిస్థాన్ ప్రమాదకరమైన జట్టు. కానీ మనం బాగా ఆడితే పైచేయి సాధించవచ్చు. స్వేచ్ఛగా ఆడాలి. స్వేచ్ఛగా అని ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నానంటే.. 2022 వరల్డ్ కప్లో టీమిండియా స్వేచ్ఛగా ఆడినట్లు కనిపించలేదు''
''గెలుపోటముల గురించి ఆలోచించకుండా పోరాడాలి. వరల్డ్ కప్ గెలవాలని ఆడకూడదు. మ్యాచ్-మ్యాచ్లా బరిలోకి దిగి గెలవాలి. కప్ గెలిచే అవకాశాలు భారత్కు మెరుగ్గా ఉన్నాయి. టీ20 జట్టులా ఆడాలి. టీమిండియాలో ఎంతో టాలెంట్ ఉంది. దూకుడుగా ఆడేలా ప్రయత్నించాలి. కోహ్లి, రోహిత్, సూర్య, పంత్, దూబె, హార్దిక్, జడేజా, అక్షర్, బుమ్రా, శాంసన్ వంటి ఆటగాళ్లతో టీమ్ స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్లో తొలి బంతి నుంచి మోత మోగించాలి. డిఫెన్స్లో ప్రతి బంతిని చివరి బంతిగా బౌలింగ్ చేయాలి'' అని గంగూలీ పేర్కొన్నాడు.