టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచే జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయనే విషయం తెలిసిందే. అయితే గ్రూప్-ఏ నుంచి భారత్ క్వాలిఫై కావడంతో మిగిలిన ఏకైక బెర్తు కోసం అమెరికా, పాకిస్థాన్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. హాట్ ఫేవరేట్గా టోర్నీలోకి అడుగుపెట్టిన టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో లీగ్ దశను అధిగమించింది.
బుధవారం నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో నెగ్గి సాధించి సూపర్-8కు చేరింది. అయితే యునైటెడ్ స్టేట్స్పై ఇండియా ఘన విజయం సాధించడం పాకిస్థాన్కు కలిసొచ్చింది. ప్రస్తుతం మూడు మ్యాచ్లు ఆడిన అమెరికా నాలుగు పాయింట్లు, +0.127 నెట్రన్రేటుతో రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ మూడింట్లో ఒకటి నెగ్గి రెండు పాయింట్లు, +0.191 నెట్రన్రేటుతో మూడో స్థానంలో ఉంది.

అయితే భారత్ చేతిలో ఓడిన అమెరికా నెట్రన్రేటును కోల్పోయింది. నెట్రన్రేటు పరంగా చూస్తే అమెరికా కంటే పాకిస్థాన్ మెరుగైన స్థితిలో ఉంది. దీంతో పాక్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధించాలంటే అంత సులువు కాదు. భారత్ పరోక్షంగా సాయం చేసినప్పటికీ మిగిలిన ఫలితాలపై పాకిస్థాన్ ఆధారపడాల్సి ఉంది. పాకిస్థాన్ క్వాలిఫై కావాలంటే తమ చివరి మ్యాచ్లో ఐర్లాండ్పై తప్పక నెగ్గాలి. మరోవైపు ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోవాలి.
అలా జరిగితే నెట్ రన్ రేటుతో సంబంధం లేకుండా పాకిస్థాన్ నేరుగా సూపర్-8కు చేరుకుంటుంది. కానీ భారత్కు గట్టి పోటీనిచ్చిన అమెరికా ఐర్లాండ్ ముందు తలవంచుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పాకిస్థాన్ను మరో విషయం కలవరపెడుతోంది. వరుణుడు అమెరికా-ఐర్లాండ్, పాకిస్థాన్-ఐర్లాండ్ మ్యాచ్లకు ఆటంకం కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్థానిక వాతావరణ శాఖ ప్రకారం ఈ రెండు మ్యాచ్లు జరిగే రోజు వర్షం పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ రెండింట్లో ఏ మ్యాచ్ రద్దయినా పాకిస్థాన్ ఇంటికి వెళ్లాల్సిందే!
ఎలా అంటే.. శుక్రవారం జరగాల్సిన అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఖాతాలో అయిదు పాయింట్లు నిలుస్తాయి. ఆ తర్వాత ఐర్లాండ్పై పాక్ నెగ్గినా నాలుగు పాయింట్లతోనే లీగ్ ముగిస్తుంది. దీంతో అమెరికాను పాయింట్ల పరంగా పాక్ దాటలేదు. ఒకవేళ ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓటమిపాలై, తమ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా పాకిస్థాన్కు నష్టమే. ఆ సందర్భంలో అమెరికా నాలుగు పాయింట్లు, పాకిస్థాన్ మూడు పాయింట్లతోనూ లీగ్ స్టేజ్ను ముగిస్తుంది.