India Playing XI vs England: టీ20 వరల్డ్ కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో తలపడనుంది. గయానా వేదికగా గురువారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీలో ఓటమెరుగుని భారత్ ఇంగ్లండపై కూడా విజయఢంకా మోగించి ఫైనల్కు దూసుకెళ్లాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను ఓడించాలంటే భారత్కు అంత ఈజీ కాదు.
పక్కా ప్రణాళికలతో, కఠోర శ్రమతో ఇంగ్లండ్కు భారత్ ఉచ్చు బిగించాలి. కాస్త అలసత్వం ప్రదర్శించినా గత టీ20 ప్రపంచకప్లో ఎదురైన చేదు అనుభవం టీమిండియాకు మిగులుతుంది. 2022 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లండ్తోనే భారత్ సెమీఫైనల్ ఆడింది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ సేనను ఇంగ్లిష్ జట్టు చిత్తుగా ఓడించింది. 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 16 ఓవర్లోనే ఛేదించింది.

గత ప్రపంచకప్ జట్టు కంటే ఇంగ్లండ్ ఈసారి మరింత ప్రమాదకరంగా ఉంది. ఈ టోర్నీలో మోన్స్టర్స్లా చెలరేగిపోతున్నారు. ఒమన్పై 3.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అమెరికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లోనూ 116 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోపే అందుకుంది. అంతేగాక జట్టు నిండా ఆల్రౌండర్లే. దీంతో ఇంగ్లండ్ను బోల్తా కొట్టించడానికి సమర్థవంతమైన తుది జట్టును ఎంపిక చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.
ప్రస్తుత ప్రపంచకప్లో నిరాశపరుస్తున్న రవీంద్ర జడేజాను తప్పించి స్పెషలిస్ట్ బ్యాటర్కు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. జడేజా స్థానంలో సంజు శాంసన్ను జట్టులోకి తీసుకురావాలని చూస్తోంది. గయానా పిచ్ బంతితో పాటు బ్యాటుకు సమంగా అనుకూలిస్తుంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో జడేజా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో జడేజాను పక్కనపెట్టి శాంసన్ను తీసుకుంటే భారీ స్కోరు లేదా భారీ ఛేదనను చేయవచ్చని ప్లాన్ చేస్తోంది. అయితే అదే తుది జట్టును కొనసాగించాలనే సెంటిమెంట్ కూడా భారత్ పాటించే అవకాశం ఉంది. అలా భావిస్తే జడేజా జట్టులో కొనసాగుతాడు.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా/సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్