టీ20 వరల్డ్ కప్లో హైవోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. సెయింట్ లూసియా వేదికగా సోమవారం భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ పోరులో విజయం సాధిస్తే టీమిండియా నెట్రన్రేటుతో సంబంధం లేకుండా సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి లేదంటే ఇంటిముఖం పట్టాల్సిందే.
అయితే ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని టీమిండియా అభిమానులు భావిస్తున్నారు. సెమీస్లో కంగారూలు అడుగుపెట్టకుండానే టోర్నీ నుంచి ఔట్ చేయాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. గతేడాది భారత్ నుంచి ఆస్ట్రేలియా రెండు ఐసీసీ టోర్నీలను లాగేసుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిఫ్ ఫైనల్లో రోహిత్ సేనను ఓడించి విజేతగా నిలిచింది.

ఇక వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ భారత్కు ఆస్ట్రేలియా కన్నీటినే మిగిల్చింది. 2023, నవంబర్ 19వ తేదీని శిఖర్ ధావన్తో సహా భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికే మరిచిపోలేకపోతున్నారు. టోర్నీ ఆద్యంతం వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా ఆఖరి మెట్టుపై బోల్తాపడి కప్ను చేజార్చకుంది. ఆ రోజున భారత ఆటగాళ్లు కన్నీటిని ఆపుకుంటూ మైదానాన్ని విడిచిన క్షణాలు అభిమానులు అంత సులువుగా మరవలేరు. అయితే వన్డే వరల్డ్ కప్ ప్రతీకారాన్ని తీర్చుకోవాలని అభిమానులతో పాటు టీమిండియా భావిస్తోంది.
దాని కోసం భారత్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. టీ20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు అదే తుదిజట్టును కొనసాగించిన టీమిండియా.. ఆస్ట్రేలియా ఊహలకు అందకుండా జట్టుకూర్పు సిద్ధం చేయాలని భావిస్తోంది. అంతే సెయింట్ లూసియా పిచ్కు తగ్గట్లుగా జట్టను ఎంపిక చేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. సెయింట్ లూసియా వికెట్ స్లోగా ఉంటుంది. కుల్దీప్ యాదవ్ రాకతో స్పిన్ విభాగం బలోపేతంగా మారింది.
కుల్దీప్కు తోడుగా అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నాడు. దీంతో రవీంద్ర జడేజా స్థానంలో మహ్మద్ సిరాజ్ను జట్టులోకి తీసుకురావాలని భారత్ భావిస్తోంది. పిచ్తో పాటు మైదానంలో వచ్చే గాలిని సిరాజ్ సమర్థవంతంగా ఉపయోగించుకోగలడు. కొత్త బంతితో విజృంభించగలడు. దీంతో సిరాజ్ను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్