ఇండియా-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచంటే రెండు దేశాల అభిమానులే కాదు, ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. మినీవార్ను తలపించేలా ఇరు జట్ల మధ్య ఫైట్ ఉంటుంది. తల అయినా తెంచుకుంటాం కానీ ఓటమిని ఒప్పుకోమనే రీతిలో.. ఆటలో ఉద్రిక్తత, భావోద్వేగం కనిపిస్తుంటుంది. అయితే వచ్చే టీ20 వరల్డ్ కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ దాదాపు ఖరారైంది.
ఈ ఏడాది జూన్ లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఐసీసీ అధికారులు ఆ దేశాల్లో పర్యటించి షెడ్యూల్కు ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలో భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల తేదీలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్, జూన్ 9న పాకిస్థాన్, జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడా దేశాలతో టీమిండియా తలపడనుంది.

న్యూయర్క్లోని ఐసెన్హోవర్ పార్క్ వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ వేదికను ప్రపంచకప్ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ స్టేడియం కెపాసిటీ సుమారు 34,000. కాగా, న్యూయార్క్ లో దాదాపు ఏడు లక్షల మంది భారత్ సంతతికి చెందినవారు ఉండగా, పాక్ మూలాలున్న వారు లక్ష మంది వరకు ఉన్నారు.
అయితే ఈ సారి టీ20 ప్రపంచకప్లో 20 జట్లు పోటీపడుతున్నాయి. అయిదు జట్లను ఒక గ్రూప్గా ఎంపిక చేసి అన్ని జట్లను నాలుగు గ్రూప్లుగా విభజిస్తారు. గ్రూప్ల్లో నిలిచిన టాప్-2 జట్లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. ఈ సూపర్-8 జట్లను కూడా రెండు గ్రూప్లుగా విభజిస్తారు. వాటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. సెమీస్లో గెలిచిన జట్లు ఫైనల్కు వెళ్తాయి.
మరోవైపు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న జూన్ 9వ తేదీ విరాట్ కోహ్లికి చాలా స్పెషల్. ఆ రోజున కోహ్లి చేసిన పనికి స్పిరిట్ ఆఫ్ క్రికెట్-2019 అవార్డును ఐసీసీ అందజేసింది. 2019 జూన్ 9న ప్రపంచకప్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది. అయితే స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు.. ఛీటర్.. ఛీటర్ అంటూ స్టీవ్ స్మిత్ను అవమానించారు. బాల్ టాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురైన స్మిత్ వరల్డ్కప్లో పాల్గొనడంతో ఛీటర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కోహ్లి అలా చేయొద్దని ప్రేక్షకులకు సూచించడంతో వారంతా ఆపేశారు. సరిగ్గా అయిదేళ్ల తర్వాత రోజున భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్ కానుండటం విశేషం.